అబ్బాయిల పెళ్లి వయసును 18 కి తగ్గించాలి : ఓవైసీ సంచలనం

-

అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిల పెళ్లి వయసు పెంచే బదులు అబ్బాయిల వివాహ వయసు 21 సంవత్సరాల నుంచి.. 18 ఏళ్లకు తగ్గించాలని ఓవైసి డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వ పితృస్వామ్య విధానాలకు ఈ నిర్ణయం మంచి ఉదాహరణ అని మండిపడ్డారు.

18 సంవత్సరాల వయసున్న వారు ఒప్పందాలపై సంతకాలు చేయొచ్చు.. వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ప్రధానమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకోవచ్చు కానీ పెళ్ళి మాత్రం చేసుకోకూడదా ? అని నిలదీశారు. సెక్స్ వల్ రిలేషన్ షిప్ లో ఉండేందుకు, లివింగ్ పార్ట్నర్ షిప్ తో ఉండడానికి నిర్ణయం తీసుకోవచ్చు కానీ.. వాళ్ళ జీవిత భాగస్వామిని ఎంచుకో కూడదా ? అంటూ ఓవైసీ ఫైర్ అయ్యారు.

దేశంలో ప్రతి నలుగురు అమ్మాయిలలో ఒకరికి 18 సంవత్సరాల లోపు పెళ్లి చేస్తున్నారని… కానీ వాటిపై కేవలం 785 క్రిమినల్ కేసులు మాత్రమే నమోదయ్యాయని గుర్తుచేశారు. నిజంగా మహిళలపై ప్రధాని మోడీ కి చిత్తశుద్ధి ఉంటే వారి ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచేందుకు అవకాశాలు పెంచాలని.. ఉపాధి, ఉద్యోగాలు అందించాలని డిమాండ్ చేశారు. మహిళల ఓట్లు రాబట్టడానికి… ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news