నాని అంటే సుందరానికీ అందుకే ఆకట్టుకోలేకపోయిందా?

-

నేచురల్​ స్టార్​ నాని నటించిన ‘అంటే సుందరానికీ!’ చిత్రంపై తన అభిప్రాయన్ని వెల్లడించారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘పరుచూరి పాఠాలు’ పేరిట ప్రస్తుత సినిమాలపై తన అభిప్రాయాలను పంచుకొంటున్న ఆయన.. తాజాగా ‘అంటే సుందరానికీ!’ చిత్రం ఆశించినంత స్థాయిలో ఎందుకు విజయం సాధించలేదో తనదైన శైలిలో విశ్లేషించారు.

ఈ చిత్రం విషయంలో దర్శకుడు తీసుకున్న పాయింట్ చాలా బాగుందని, స్క్రీన్‌ప్లే బెడిసికొట్టడం వల్లే ఈ సినిమా కొంచెం గాడి తప్పిందన్నారు. మతాంతర ప్రేమకథా స్టోరీలైన్‌తో వచ్చిన ఈ సినిమా ఆ పాయింట్‌ను విస్మరించిందని అభిప్రాయపడ్డారు. స్క్రీన్‌ప్లేలో ఫ్లాష్‌ బ్యాక్‌ సీన్‌లు, మలుపులు ఎక్కువయ్యాయని, ఇలాంటి సీన్లు ఎక్కువయితే ప్రేక్షకులు మూడు గంటలపాటు థియేటర్లలో ఉండటానికి ఇష్టపడరని చెప్పారు. కథకు అవసరం లేని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు అంతగా నచ్చవని తెలిపారు.

ఈ సందర్భంగా ఇదే కంటెంట్‌పై వచ్చి విజయం సాధించిన కొన్ని చిత్రాలను ఆయన గుర్తు చేశారు. మూడుగంటల పాటు ప్రేక్షకుల్ని కథలో లీనం చేసేలా స్క్రీన్‌ప్లే ఉండాలన్నారు. అయితే ఈ సినిమాలో నటీనటులు అద్భుతంగా నటించారని పరుచూరి కితాబిచ్చారు. ముఖ్యంగా కథానాయకుడు నాని నటన చాలా సహజంగా ఉంటుందని, ఈ సినిమాలో కూడా బాగా నటించాడని అభినందించారు. క్లైమాక్స్‌తో దర్శకుడు వివేక్‌ ఆత్రేయ మెప్పించారని, చివరి అరగంట సినిమాను బాగా నడిపించారని పరుచూరి ప్రశంసించారు. మొత్తానికి ఈ సినిమా బాగుంది కానీ.. కొన్ని సన్నివేశాలను మెరుగ్గా తీసి ఉంటే మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకునేదని ఆయన అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news