కేంద్ర గెజిట్‌ రాజ్యాంగ విరుద్ధం.. ప్రాజెక్టుల నిర్వహణపై హైకోర్టులో వ్యాజ్యం

-

రాజెక్టులను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తీసుకువస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుల పరిధిలోకి తెస్తూ కేంద్రం గత ఏడాది జులై 15న జారీ చేసిన గెజిట్‌ను సవాలు చేస్తూ టీడీఎఫ్‌ తరఫున డి.పాండురంగారెడ్డితో పాటు మరో ఇద్దరు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ విచారణార్హతపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్‌ 11 ప్రకారం వివాదాల పరిష్కారంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల పరిధి నేపథ్యంలో పిటిషన్‌కు నంబరు కేటాయించడంపై రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. అయితే ఈ పిటిషన్‌ అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలో పేర్కొన్నట్లుగా వివాదం కాదన్నారు. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం కింద కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసిందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం హైకోర్టుకు ఉందని అన్నారు.

ప్రాజెక్టులపై రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కేంద్రం లాక్కోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. నీటి కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించడానికి బదులు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను తీసుకుందని తెలిపారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అంతేగాకుండా బోర్డుల నిర్వహణకు ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు చొప్పున ఒక్కో రాష్ట్రం రూ.400 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఈ ఏకపక్ష ఆదేశాలను రాష్ట్రాలు అమలు చేయడం లేదన్నారు.

అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ.. కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వానికి న్యాయ సలహా ఇచ్చినట్లు చెప్పారు. ఇది అంతర్రాష్ట్ర జల వివాదం కాదని, దీనిపై విచారించే పరిధి హైకోర్టుకు ఉందన్నారు. విచారణార్హతపై పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపించడానికి ధర్మాసనం విచారణను సెప్టెంబరు 20కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news