పినపాక పోరు..రేగాకు రిస్క్..సీతక్క వారసుడుకు సెట్ అవుతుందా!

-

ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం..రాజకీయంగా ఆసక్తి రేపుతున్న స్థానం. మొదట నుంచి కాంగ్రెస్ పార్టీకి కాస్త పట్టున్న ఈ స్థానాన్ని నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా దక్కించుకోవాలని బి‌ఆర్‌ఎస్ పార్టీ చూస్తుంది. అయితే అక్కడ రాజకీయంగా అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకునేలా ఉన్నాయి. ఇక్కడ బి‌ఆర్‌ఎస్ తరుపున రేగా కాంతారావు పోటీకి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ తరుపున పోటీ చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క తనయుడు సూర్య ప్రయత్నిస్తున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సైతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గంలో ఉన్నారు..ఆయన బరిలో దిగాలని చూస్తున్నారు.

అయితే 2009 నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉంది. 2009లో కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పాయం వెంకటేశ్వర్లు గెలిచారు. ఆ తర్వాత ఆయన బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. 2018 ఎన్నికల వచ్చేసరికి పాయం బి‌ఆర్‌ఎస్ నుంచి, రేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. విజయం రేగాని వరించింది. అయితే ఆ తర్వాత రేగా బి‌ఆర్‌ఎస్ పార్టీలోకి జంప్ చేశారు. జంప్ చేసాకే రేగాపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది.

అటు అదే పార్టీలో ఉన్న పాయంతో విభేదాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన పొంగులేటి వర్గంలోకి పాయం వచ్చారు. దీంతో పొంగులేటి ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని పాయం చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి పినపాక సీటు దక్కించుకోవాలని సీతక్క వారసుడు సూర్య చూస్తున్నారు. కానీ స్థానిక నాయకులు కొందరు సూర్యని వ్యతిరేకిస్తున్నారు.

దీంతో కాంగ్రెస్ సీటుపై క్లారిటీ లేదు. అయితే ఈ సారి పినపాక పోరు ఆసక్తికరంగా జరిగేలా ఉంది. ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు పొంగులేటితో కారు పార్టీకి డ్యామేజ్ జరిగేలా ఉంది. రేగాకు గెలుపు అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి పినపాక ఎవరికి దక్కుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news