ఏపీలో తెరపైకి మరో రాజకీయ కూటమి

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కూటమి ఏర్పడబోతోంది. ఇప్పటికే జట్టు కట్టిన తెలుగుదేశం,జనసేన పార్టీలు రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. ఈ కూటమిలో బీజేపీ మరో భాగస్వామిగా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అధికార వైసీపీ ఈసారి కూడా ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది.ఈ నేపద్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరో కూటమి ఏర్పాటుకి సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడగా ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

జాతీయ స్థాయిలో భారతీయ జనతాపార్టీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ సెపరేట్ కూటమిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీతో కలవని లోకల్ పార్టీలతో కాంగ్రెస్ జతకట్టింది. ఈ కూటమికి ఇండియా అని పేరు కూడా పెట్టుకుని సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ కూటమిలో సమాజ్వాదీ, ఎన్సీపీ వంటి ముఖ్య పార్టీలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు చక్రం తిప్పిన ఉభయ కమ్యూనిస్టులు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఏపీలో అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా మరో కూటమి ఏర్పాటవుతోంది. కాంగ్రెస్ పార్టీ దీనికి సారథ్యం వహించనుంది. ఇందులో సీపీఐ, సీపీఎంతోపాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏర్పాటు చేసిన జై భారత్‌ నేషనల్‌ పార్టీ కూడా చేరబోతున్నట్టు సమాచారం.

టీడీపీ, జనసేన ఏర్పాటు చేసే కూటమిలో సీపీఐ, సీపీఎం పార్టీలు చేరాలని తొలుత భావించాయి. చంద్రబాబు అరెస్ట్‌ అయిన తరువాత ఈ రెండు పార్టీల కీలక నేతలు లోకేశ్‌తోపాటు ఆ పార్టీ నేతలకు అండగా నిలబడ్డారు.  ఒకానొక దశలో ఈ నాలుగు పార్టీలు కూటమిగా ఏర్పాటు అవుతాయని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా బీజేపీ ఈ కూటమిలో చేరడంతో కమ్యూనిస్ట్‌ పార్టీలు టీడీపీ, జనసేనకు దూరం జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఏర్పాటు చేసే కూటమిలో ఈ రెండు పార్టీలు చేరబోతున్నాయి. వీటితోపాటు లక్ష్మీనారాయణ కూడా చేరబోతున్నారు. మొత్తానికి ఏపీలో మరో కూటమి ఏర్పాటు అవుతుందన్న వార్తలు ఊపందుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news