ఆ ఇద్దరు నేతలది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?

-

ఆలూ లేదు.. చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది ఏపీలో ఆ ఇద్దరి నేతల పరిస్థితి. ఒకవైపు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు. అందరూ రిలాక్స్ గా ఉండగా.. ఆ ఇద్దరు నేతలు మాత్రం రాజకీయ వేడి పెంచుతున్నారు. ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు. గెలుపు పై ధీమాతో పాటు ఏకంగా తమ నేతలు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెప్పుకొస్తున్నారు. దీంతో ఒక రకమైన గందరగోళానికి కారణం అవుతున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావులు.

ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. ఓటర్ తీర్పు ఈవీఎంలలో ఉంది. జూన్ 4న వెల్లడి కానుంది. ఇంతలో నేతల ప్రకటనలు చూస్తుంటే అతిగా ఉన్నాయి. జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని మంత్రి బొత్స ప్రకటించారు. ఫలితాలు వచ్చిన తర్వాత అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పుకొచ్చారు. అదే సమయంలో టిడిపికి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం చంద్రబాబు జూన్ 9న సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. దీంతో ఒకప్పటి మిత్రులు, ఇప్పటి రాజకీయ ప్రత్యర్థులు భిన్న ప్రకటనలు చేయడంతో ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. గెలుపు వరకు ధీమా కనబరుస్తున్న నేతలు… ప్రమాణస్వీకారాల జోలికి మాత్రం వెళ్లలేదు. అయితే ఈ ఇద్దరు నేతలు ఏకంగా అధికారంలోకి వస్తామని.. తమ నేతలు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తేల్చి చెప్పడం విశేషం.

ప్రస్తుతం చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బొత్స పోటీ చేస్తున్నారు. భీమిలి అసెంబ్లీ సీట్లు నుంచి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న గంటా శ్రీనివాసరావు టిడిపి అభ్యర్థిగా బరిలో దిగారు. వాస్తవానికి చీపురుపల్లిలో బొత్స పై గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ గంటా కోరిక మేరకు భీమిలి స్థానాన్ని ఖరారు చేశారు చంద్రబాబు. అయితే పోలింగ్ తర్వాత ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం గమనార్హం. ఇద్దరు ఒకేసారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మధ్యలో బొత్స కు పరాజయాలు పలకరించాయి. కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు.

అయితే.. ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఈ ఇద్దరు మిత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. జూన్ 9న చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని గంటా శ్రీనివాసరావు జోష్యం చెప్పారు. బొత్స సత్యనారాయణ ఇంకో అడుగు ముందుకేసి… విశాఖ నగరంలో జూన్ 9న జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని తేల్చి చెప్పారు. మాజీ మంత్రి హోదాలో గంటా శ్రీనివాసరావుకు ఆహ్వానం పంపుతామని.. తప్పకుండా హాజరుకావాలని కౌంటర్ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో ఏ ఇతర సీనియర్ నేతలు ఫలితాలపై పెద్దగా మాట్లాడటం లేదు. కానీ ఈ ఇద్దరు నేతలు మాత్రమే ఏకంగా ప్రమాణస్వీకారాలపై వ్యాఖ్యానించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news