బాబుకు ఆ టెన్షన్ నుంచి విముక్తి ప్రసాదించు గంటా!

-

సాధారణంగా రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య నిత్యం మాటల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఒక పక్షం ఒకటంటే.. ప్రత్యర్థి పక్షం రెండు అంటుంది! పైగా ఏపీ వంటి రాష్ట్రాల్లో ఈ తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది. అధికార వైకాపా – ప్రతిపక్ష టీడీపీ నేతలు మధ్య అయితే మాటలు కోటలు దాటుతుంటాయి. ఈ క్రమంలో ఏపీ మంత్రి తీవ్రస్థాయిలో విమర్శించినా… జగన్ పాలనపై స్పందించమని అడిగినా… సమయం వచ్చినప్పుడు అంటూ సైడవుతున్నారు ఏపీ టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు!

ప్రస్తుతం టీడీపీతో ఇష్టం లేని కాపురం చేస్తున్నారా అన్న సందేహం కలిగించేలా ప్రవర్తిస్తోన్న గంటా శ్రీనివాస రావు తాజాగా మరోసారి తన మాటలతో బాబును ఇరకాటంలో పెట్టారు. ఏడాది పాలనపై వైకాపా నేతలు ఫుల్ హడావిడి చేసి.. ఈ ఏడాది జగన్ జనాలకు చేసింది ఏమిటి అన్న విషయంపై పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యేలా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ పాలంకు సున్నా మార్కులని.. మైనస్ వంద మార్కులని ఎవరి స్థాయిలో వారు టీడీపీ నేతలు ఫైరయిపోతుంటే… గంటా మాత్రం “సమయం వచ్చినప్పుడు స్పందిస్తాను” అనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

ఇదే క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్… విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా పేరు మర్చిపోయిందని, ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే కనిపించడం లేదని.. హ్యాండ్ కర్చీఫ్ మార్చినట్టు పార్టీ మార్చే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది గంటా అని.. బాబు, గంటా రాజకీయ వ్యాపారాలు చేసే నేతలని.. గంటా శ్రీనివాస రావు పై నిప్పులు చెరిగారు! ఈ విషయాలపై కూడా గంటా స్పందించలేదు. సమయం వచ్చినప్పుడు అంటూ సైడయిపోతున్నారు తప్ప స్పందించడం లేదు! ప్రస్తుతం ఈ మౌనమే బాబును ఇబ్బంది పెడుతుందని అంటున్నారు విశ్లేషకులు!

జగన్ విషయంలోనూ స్పందించక, ఆఖరికి తనపై వచ్చిన ఆరోపణలను కూడా గంటా లైట్ తీసుకోవడంతో… గంటా మనసులో ఉన్న ఆలోచన ఏమిటో అర్ధం కాక.. బాబు చాలా ఇబ్బంది పడుతున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు! ఏది ఏమైనా… వీలైనంత త్వరగా గంటా అనుకుంటున్న “సమయం” రావాలని.. బాబుకు ఈ టెన్షన్ నుంచి విముక్తిని వీలైనంత త్వరగా ప్రసాదించాలని పలువురు కోరుకుంటున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news