గ్రేటర్‌ టీడీపీ ప్రచారంలో మెరుపుల్లేవా

-

గ్రేటర్‌ ఎన్నికల్లో వందకుపైగా స్థానాల్లో పోటీ చేస్తోన్న టీడీపీ ప్రచారంలో ఎలాంటి హడావిడి కనిపించడం లేదు.చంద్రబాబు, లోకేష్‌, బాలయ్యలు ప్రచారానికి వస్తారని భావించినా.. అటువంటి సందడే లేదు. ఒకప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలంటే సిటీలో వాలిపోయే ఏపీ టీడీపీ నేతలు ఇప్పుడెందుకు దూరంగా ఉన్నారు? తెలంగాణ టీడీపీలో ఇప్పుడు ఈ అంశం పైనే చర్చ జరుగుతుంది.

ఒకప్పుడు హైదరాబాద్‌ మేయర్‌ స్థానాన్ని కైవశం చేసుకున్న టీడీపీ… ఇప్పుడు తెలంగాణలోనూ.. గ్రేటర్‌ సిటీలోనూ ఉనికి చాటుకునే పనిలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం నుంచి బయటపడేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికలను ఒక ప్లాట్‌ఫామ్‌గా భావిస్తున్నారు టీడీపీ నేతలు. చాలా ఏళ్ల తర్వాత గ్రేటర్‌ బరిలో ఒంటరిగా దిగిన టీడీపీ 106 స్థానాల్లో పోటీ చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీ మ్యానిఫెస్టో విడుదల వరకు అంతా తెలంగాణ టీడీపీ నాయకుల పర్యవేక్షణలోనే సాగింది. తెర వెనక చంద్రబాబు మంత్రంగం నడిపినా ఎక్కడా ఆ మాట బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు స్థానిక నాయకులు.

ఇంత వరకు బాగానే ఉన్నా.. టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో తెలంగాణ నాయకులే పాల్గొంటున్నారు తప్ప.. చంద్రబాబు, లోకేష్‌, బాలయ్యల ఊసే వినిపించడం లేదు. ఈ ముగ్గురు నాయకులు తప్పకుండా వస్తారని.. టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారని భావించారు తెలుగు తమ్ముళ్లు. ప్రచారం ముగింపు గడువు సమీపిస్తున్నా.. వారు వస్తారన్న జాడ లేదు. గత గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు, నారా లోకేష్‌లు కాలికి బలపం కట్టుకున్నట్టుగా సిటీని చుట్టేశారు. బహిరంగ సభలు పెట్టారు. కానీ.. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒక్క కార్పొరేటరే గెలిచారు. ఇప్పుడు అంతకు మించిన ఆశలు పెట్టుకున్నారు తెలుగు తమ్ముళ్లు.

గ్రేటర్ ఎన్నికలు అంటే.. ఏపీ టీడీపీ నేతలు కూడా ఎంతో ఆసక్తి చూపించేవారు. ఎన్నికలయ్యే వరకు సిటీలోనే ఉండి ఆంధ్ర ప్రాంత ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసేవారు. గల్లీ గల్లీల్లో తిరిగి ప్రచారం చేసేవారు ఏపీ టీడీపీ నాయకులు. ఇప్పుడు వారి ఆచూకీ కూడా లేదు. ఏపీ నుంచి ఈ దఫా టీడీపీ నేతలు ప్రచారానికి రావడం లేదట. అలా వస్తే ప్రత్యర్థి పార్టీలు టీడీపీపై ఆంధ్ర అనే ముద్ర వేస్తాయని అనుమానిస్తున్నారట. 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో ఇదే జరిగిందని.. అందుకే ఈ ఎన్నికల్లో అలాంటిది రిపీట్‌ కాకుండా చూస్తున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news