గల్లీ కార్పోరేటర్ నుంచి చట్టసభల్లో అడుగుపెట్టిన నేతలు వీరే

-

నేటి కార్పొరేటర్లే రేపటి ఎమ్మెల్యేలు… మంత్రులు. నగరంలో గల్లీ లీడర్ నుంచి ఎదిగి మంత్రులైన నాయకులు ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిన్నగా మొదలైన వీరి రాజకీయం ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది. ప్రజల మన్ననలు పొందేలా రాజకీయం చేస్తే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చనడానికి వీరే ఉదాహరణ.

రాజకీయంలో తొలి అడుగు సవ్యంగా పడితేనే భవిష్యత్తు బాగుంటుంది. హైదరాబాద్ గల్లీ లీడర్‌గా రాజకీయ ఓనమాలు దిద్దుకున్న వారు కొందరు ఇప్పుడు.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలను తమ రాజకీయ ఎదుగుదలకు వేదికగా చేసుకున్నారు. ఇంకొందరు ఇప్పుడిప్పుడే ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పార్టీల్లో ఇలాంటి నాయకులున్నారు.

ప్రస్తుతం మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ జీవితం ఒకప్పుడు కార్పొరేటర్‌గానే ప్రారంభమైంది. 1986లో మోండామార్కెట్‌ నుంచి జనతాదళ్‌ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 1994,1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి గెలిచారు. 2004లో ఓడిపోయారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నిక, 2014 జనరల్‌ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పార్టీలో చేరారు. వరుసగా రెండు టీఆర్‌ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్నారు.

గ్రేటర్ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్. బీజేపీ కీలక నేతల్లో ఆయన ఒకరు. ప్రస్తుతం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. గత శాసనసభలో బీజేఎల్పీ లీడర్‌గా వ్యవహరించారు. లక్ష్మణ్ రాజకీయ జీవితం కూడా కార్పొరేటర్‌గానే ప్రారంభమైంది. 1986లో జవహర్‌నగర్‌ డివిజన్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1999, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. నగర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న నేతల్లో ముఖేశ్‌గౌడ్‌ ఒకరు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఘనత ఆయన సొంతం. ముకేష్‌ గౌడ్‌ కూడా కార్పొరేటర్‌ స్థాయి నుంచే వచ్చారు. 1986లో జాంబాగ్‌ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు.

ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న పద్మారావు కూడా బల్దియా నుంచి వచ్చిన నాయకుడే. 2002లో మోండా మార్కెట్‌ నుంచి బల్దియాకు ఎన్నికయ్యారు. 2004లో తెరాస నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2014లో మరోసారి గెలిచి మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లోనూ విజయం సాధించారు. పాతబస్తీలో ఎంఐఎంను తిరుగులేని శక్తిగా నిలిపిన.. ఘనత సీనియర్ లీడర్ సలావుద్దీన్ ఓవైసీకి దక్కుతుంది. తండ్రి అబ్దుల్‌ వాహెద్‌ ఒవైసీ మరణం తర్వాత మజ్లిస్‌ పగ్గాల్ని చేపట్టిన సలావుద్దీన్ ఓవైసీ కూడా బల్దియా నుంచే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1960లో మల్లేపల్లి డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. ఆ తర్వాత ఐదుసార్లు ఎమ్మెల్యేగా , ఆరు సార్లు ఎంపీగా విజయం సాధించారు.

వీరే కాదు… రేణుకాచౌదరి.. సుధీర్‌రెడ్డి… వంటి నేతలు కూడా నగరం నుంచే తమ రాజకీయ యాత్రను ప్రారంభించారు. రేణుకాచౌదరి 1986లో బంజారాహిల్స్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు. ప్రస్తుతం ఎల్బీనగర్‌ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్‌రెడ్డి ఒకప్పుడు కార్పొరేటర్‌గా పనిచేశారు. 1986 మున్సిపల్‌ ఎన్నికల్లో మూసారంబాగ్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. ప్రస్తుతం కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా ఉన్న పి.సాయన్న 1986లో జరిగిన బల్దియా ఎన్నికల్లో దోమల్‌గూడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. హైదరాబాద్ నగరానికి మేయర్‌గా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి కూడా బల్దియా నాయకుడే. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Read more RELATED
Recommended to you

Latest news