నిన్న రాజీనామా …నేడు రాజి ..ఏందయ్యా ఇదీ ..!?

-

సుదీర్ఘకాలంగా బీజేపీలో ఉంటూ, కేంద్ర మంత్రిగానూ పని చేసి, గుజరాత్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మనుసుఖ్ భాయ్ వాసవ మంగళవారం బీజేపీ కి రాజీనామా చేసారు. పార్లమెంటు బడ్జెట్ సెషన్‌లో ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు చెప్పారు. గిరిజన సమస్యలపై గొంతెత్తే ఆయన ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. నర్మద జిల్లాలోని 121 గ్రామాలను ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటిస్తూ పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్‌ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఆ లేఖలో తీవ్రంగా వ్యతిరేకించారు. దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గుజరాత్‌లోని భరూచ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న వాసవ.. నర్మదా జిల్లాలోని రైతాంగానికి మేలు చేయబోయి, సొంత పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. ప్రధాని మోదీకి ఆయన రాసిన లేఖపై ఎంతకూ సమాధానం రాకపోవడంతో విరక్తి చెంది అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బీజేపీని వీడుతున్నట్లు ఎంపీ మన్‌సుఖ్‌‌ భాయి వాసవ మంగళవారం బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌కు లేఖ రాశారు. ఆరు సార్లు లోక్‌సభకు ఎన్నికైన వాసవ.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. బరూచ్ నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌కు లేఖ రాస్తూ.. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నంత మాత్రాన పార్టీ ప్రతిష్ఠకు ఏమీ భంగం వాటిల్లబోదని, పార్టీకి తాను విశ్వాసమైన కార్యకర్తనని, తనను క్షమించాలని కోరారు. అయితే, ఆయన రాజీనామా వెనకున్న కారణాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు.

ఎంతోకాలంగా పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్నాను. పార్టీ విలువలు, విధానాలను కాపాడేందుకు ప్రయత్నించాను. అయితే, అన్నింటికి మించి నేనో మనిషిని. తెలిసో తెలియకో మనిషి తప్పులు చేసుండొచ్చు. నా తప్పుల వల్ల గొప్పదైన పార్టీకి నష్టం వాటిల్లొద్దనే ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నాను. పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కూడా వదులుకుంటాను. బడ్జెట్‌ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిసి నా రాజీనామా లేఖను అందజేస్తాను. నా నిర్ణయాన్ని కేంద్ర నాయకత్వానికి తెలియపరచండి” అని వాసవ లేఖలో పేర్కొన్నారు.అయితే గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ఆయనకు పార్టీని వీడొద్దని నచ్చజెప్పినట్టు తెలుస్తుంది. దీనితో వెనక్కి తగ్గిన ఎంపీ తన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news