సెప్టెంబర్‌ 15, 16 తేదీల్లో రష్యా, చైనా అధినేతల భేటీ

-

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే భేటీ కానున్నారు. ఉజ్బెకిస్తాన్‌లో జరిగే సదస్సులో వచ్చే వారం వీరిద్దరూ సమావేశం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తోన్న ఈ రెండు ప్రధాన దేశాలు తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకోనున్నాయి.

సెప్టెంబర్‌ 15, 16 తేదీల్లో ఇరు దేశాల అధినేతలు ఉజ్బెకిస్తాన్‌లో జరిగే సదస్సులో పాల్గొంటారని చైనాలోని రష్యా రాయబారి ఆండ్రూ దెనిసోవ్‌ పేర్కొన్నారు. 2019 తర్వాత షి జిన్‌పింగ్‌ చైనా దాటి ఎక్కడా పర్యటించలేదు. కేవలం హాంకాంగ్‌లో మాత్రమే ఒకరోజు పర్యటించారు. ఒకవేళ ఉజ్బెకిస్తాన్‌ వెళ్తే.. గత రెండున్నరేళ్లలో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే అవుతుంది.

ఆరు నెలల క్రితం ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఒంటరైన రష్యాను ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు వెంటాడుతున్నాయి. చైనాలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన జిన్‌పింగ్‌కు అక్కడ ఆర్థికవృద్ధి మందగించడం ఓ సవాల్‌గా మారింది. రష్యా, చైనాలు ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఇరు అగ్ర దేశాధినేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news