షాకిచ్చిన ఎస్బీఐ.. వడ్డీ రేట్లు పెంపు..

-

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. హోమ్ లోన్స్‌పై మినిమమ్ రేటును ఎస్బీఐ పెంచేసింది. ఇప్పుడు హౌసింగ్ లోన్స్‌పై కనీస రుణ రేటు 7.55 శాతానికి చేరింది. జూన్ 15 నుంచి ఈ కొత్త రేటు అమలులోకి వచ్చిందని ఎస్బీఐ తెలిపింది. బ్యాంక్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్)ను 7.55 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఇది వరకు ఈ రేటు 7.05 శాతంగా ఉండేది. దీంతో రుణం తీసుకొని సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది.

SBI's Dabeerpura branch in Hyderabad closed after customer tests positive  for COVID-19

అధిక వడ్డీ భారం మోయాల్సి వస్తుంది. అలాగే ఎస్బీఐ ఈబీఎల్ఆర్ రేటుకు అదనంగా క్రెడిట్ రిస్క్ ప్రీమియం కూడా జత చేసింది. అంతేకాకుండా స్టేట్ బ్యాంక్ జూన్ 15 నుంచి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును (ఎంసీఎల్ఆర్) కూడా పెంచేసింది. 20 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఎస్బీఐ డిపాజిట్ దారులకు తీపికబురు అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రేట్లు పెంచింది. 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పైకి కదిలాయి. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల రెపో రేటును వరుసగా రెండు సార్లు పెంచుతూ వెళ్లడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఆర్‌బీఐ దారిలోనే ఇతర బ్యాంకులు కూడా నడుస్తున్నాయి. ఎస్‌బీఐ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. అందుకే రుణ రేట్లు, వడ్డీ రేట్లను పెంచేసింది. ఎస్‌బీఐ చివరి సారిగా డిపాజిట్ రేట్లను ఫిబ్రవరి నెలలో పెంచింది. కాగా ఆర్‌బీఐ ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఈ రేటు 4.9 శాతానికి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news