పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా విక్ట‌రీ..!

-

టాంట‌న్‌లోని ది కూప‌ర్ అసోసియేట్స్ కౌంటీ గ్రౌండ్‌లో జ‌రుగుతున్న ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీ 17వ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా 41 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 308 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో పాకిస్థాన్ జ‌ట్టు 45.4 ఓవ‌ర్ల‌లో 266 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. కాగా పాక్ బ్యాట్స్‌మెన్ల‌లో ఓపెనర్ ఇమామ్‌-ఉల్‌-హ‌క్ (75 బంతుల్లో 53 ప‌రుగులు, 7 ఫోర్లు) ఒక్క‌డే అర్ధ సెంచ‌రీ చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ హ‌ఫీజ్ (46 ప‌రుగులు), కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ (40), వ‌హ‌బ్ రియాజ్ (45)లు కొంత సేపు నిల‌దొక్కుకునే య‌త్నం చేశారు. అయినప్ప‌టికీ పాకిస్థాన్ జ‌ట్టు ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా జ‌ట్టు విజ‌యం సాధించింది.

కాగా ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో ప్యాట్ క‌మ్మిన్స్ 3 వికెట్లు తీయ‌గా, మిచెల్ స్టార్క్‌, కేన్ రిచ‌ర్డ్స‌న్‌లు చెరో 2 వికెట్లు తీశారు. అలాగే నాథ‌న్ కౌల్ట‌ర్‌-నైల్‌, కెప్టెన్ అరోన్ ఫించ్‌లు చెరో వికెట్ తీశారు. ఇక అంత‌కు ముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జ‌ట్టు 49 ఓవ‌ర్ల‌లో 307 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో డేవిడ్ వార్న‌ర్ (111 బంతుల్లో 107 ప‌రుగులు, 11 ఫోర్లు, 1 సిక్స‌ర్‌) సెంచ‌రీ సాధించ‌గా, మ‌రో బ్యాట్స్‌మన్‌, ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ (84 బంతుల్లో 82 ప‌రుగులు, 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) రాణించాడు. దీంతో ఆస్ట్రేలియా పాక్ ఎదుట భారీ విజ‌య‌ల‌క్ష్యాన్ని ఉంచ‌గ‌లిగింది. కాగా పాక్ బౌల‌ర్ల‌లో మ‌హమ్మ‌ద్ అమీర్‌కు 5 వికెట్లు ద‌క్క‌గా, షాహీన్ అఫ్రిదికి 2 వికెట్లు ద‌క్కాయి. అలాగే హ‌స‌న్ అలీ, వ‌హ‌బ్ రియాజ్‌, మ‌హ‌మ్మ‌ద్ హ‌ఫీజ్‌లు త‌లా 1 వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news