కిషన్‌ రెడ్డి అదికూడా తెలియదా : తలసాని

-

సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు సజీవమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. వారంతా బీహార్‌కు చెందిన వలస కూలీలుగా తేలింది. మినిస్టర్ రోడ్డులోని ఆరంతస్తుల భవనంలో దాదాపు 12 గంటల పాటు మంటలు చెలరేగాయి. మొదట కింది అంతస్తులో మంటలు చెలరేగి.. ఆ తర్వాత బిల్డింగ్ మొత్తానికీ వ్యాపించాయి. దట్టమైన పొగలు, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్ని కీలకలను చూసి.. స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. ముందుజాగ్రత్తగా అధికారులు వారందరినీ ఖాళీ చేయించారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 12 గంటల పాటు శ్రమించి.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే.. మాల్‌ భవనం మంటల ధాటికి పూర్తిగా దెబ్బతిన్నది. ఎన్​ఐటీ వరంగల్ సంచాలకులు రమణారావు జీహెచ్​ఎంసీ, అగ్నిమాపక, క్లూస్ టీం, విద్యుత్‌ శాఖ అధికారులతో కలిసి భవనాన్ని పరిశీలించారు. వెళ్లటానికి వీలులేని చోటుకు డ్రోన్‌ను పంపి నలుమూలలా తనిఖీలు జరిపి, నాణ్యతను పరీక్షించారు. అన్ని అంతస్తుల స్లాబులు, గోడలు దెబ్బతిన్నట్లు గుర్తించిన నిపుణులు ఏ సమయంలోనైనా పడిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. భవనం మునుపటిలా ఉపయోగపడే అవకాశం లేదని వెల్లడించారు.

సికింద్రాబాద్ లోని డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ అగ్నికి ఆహుతైన ఘటనపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడ్డారు. ఈ అగ్నిప్రమాదంపై కిషన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలిపోయి 180 మంది చనిపోతే తామేమీ కిషన్ రెడ్డి లాగా రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. భవనాల రెగ్యులరైజేషన్ పై కోర్టు స్టే ఉందన్న విషయం కిషన్ రెడ్డికి తెలియదా అని తలసాని ప్రశ్నించారు. హైదరాబాదులో డెక్కన్ స్పోర్ట్స్ మాల్ వంటివి పాతిక వేల వరకు ఉండొచ్చని, అలాంటి కట్టడాల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై ఓ కమిటీ వేశామని వెల్లడించారు. అక్రమ కట్టడాలను ఇప్పటికిప్పుడు తొలగించడం కష్టమని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news