నిరసన చేస్తున్న మహిళలపై తాలిబన్ల దాడి

-

అఫ్గానిస్థాన్‌లో అధికారం చేజిక్కి ఏడాది సమీపిస్తోన్న వేళ.. తాలిబన్లు మరోసారి మహిళలపై విరుచుకుపడ్డారు. హక్కుల సాధనకు రాజధాని కాబుల్‌లో వారు చేపట్టిన ఓ నిరసన ర్యాలీని హింసాత్మకంగా అణచివేశారు. మహిళా నిరసనకారులను చెదరగొట్టేందుకు గాల్లో కాల్పులు జరపడంతోపాటు వెంబడించి మరీ వారిపై దాడులకూ పాల్పడినట్లు మీడియా కథనాలు తెలిపాయి.

గతేడాది ఆగస్టు 15న తాలిబన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి మహిళల హక్కులను కాలరాస్తూ.. అంతకుముందు రెండు దశాబ్దాల్లో వారు సాధించిన ప్రగతిని అణగదొక్కుతోన్నారని అంతర్జాతీయ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే శనివారం దాదాపు 40 మంది మహిళలు ఉద్యోగ హక్కుతోపాటు రాజకీయ భాగస్వామ్యాన్ని డిమాండ్ చేస్తూ కాబుల్‌లోని విద్యాశాఖ భవనం ముందు ప్రదర్శన నిర్వహించారు. ‘ఆగస్టు 15 బ్లాక్ డే’ అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకుని.. ఆహారం, పని, స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు చేశారు. అజ్ఞానంతో విసిగిపోయాం.. న్యాయం కావాలంటూ ర్యాలీ చేపట్టారు. దీంతో తాలిబన్లు తుపాకులతో గాల్లో కాల్పులు జరుపుతూ వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలోనే సమీపంలోని దుకాణాల్లో తలదాచుకున్న కొంతమంది మహిళా నిరసనకారులను వెంబడించి.. దాడులు చేశారు. అక్కడున్న కొంతమంది జర్నలిస్టులపైనా దాడికి దిగారు.

 

Read more RELATED
Recommended to you

Latest news