లోక్ సభ ఫలితాలపై ఆత్మపరిశీలన చేసుకో రేవంత్ : ఎంపీ లక్ష్మణ్

-

లోక్ సభ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తాము ఎవరి దయా దాక్షిణ్యాలపై గెలవలేదని, ప్రధాని మోడీపై ఉన్న నమ్మకంతో ప్రజలు తమ అభ్యర్థులను గెలిపించి లోక్ సభకు పంపారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అటకెక్కించినందునే కాంగ్రెస్ ను జనం ఛీ కొట్టారని అన్నారు.

మరో ఆరు నెలల్లో హస్తం పార్టీపై ప్రజలు తిరుగుబాటు చేయడం ఖాయమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికే చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడటం లేదని ఆయన మండిపడ్డారు. చీకటి ఒప్పందానికి పాల్పడింది ఎవరో ఇక్కడే తెలిసిపోతోందని అన్నారు. చరిత్రలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోలేదని.. ఇక మీదట కూడా పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దొంగే దొంగ అన్నట్లుగా ఉన్నాయని, చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా ఆ పార్టీకి సీట్లు వచ్చాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version