తల్లికి వందనం పథకంపై వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. పథకం ఉత్తర్వులపై కూటమి ప్రభుత్వాన్ని అడిగితే వైసీపీ నేతలకు అసహనం ఎందుకని ఆమె ప్రశ్నించారు.కాంగ్రెస్ తోకపార్టీ అంటూ వ్యాఖ్యలు చేయటం వైసీపీ అవగాహన రాహిత్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ”కాంగ్రెస్ పార్టీ పెట్టిన మీడియా సమావేశం వల్లే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనంపై వివరణ ఇచ్చింది. ప్రతిపక్షంగా తల్లుల పక్షాన కాంగ్రెస్ నిలబడింది. 2019 ఎన్నికల కంటే ముందు..
ఇద్దరు పిల్లలకు అమ్మఒడి ఇస్తానని వైఎస్ జగన్ చెప్పలేదా? అప్పట్లో నాతోనే ప్రచారం చేయించారు అని అన్నారు. ఒక్కొక్కరికి రూ.15వేలు ఇచ్చే ఉద్దేశం లేకపోతే ఎందుకు ప్రచారం చేయించారు అని ప్రశ్నించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, జలయజ్ఞం, ప్రత్యేకహోదా అంటూ ఎందుకు ప్రచారం చేయించారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతున్నా” అంటూ షర్మిల ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.