జమ్మూకశ్మీర్ విషయంలో మరోసారి నోరు పారేసుకున్న చైనాకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. పర్యాటక రంగంపై జీ20 వర్కింగ్ గ్రూపు మూడో సదస్సు జమ్మూకశ్మీర్లో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేసింది. దీన్ని తీవ్రంగా ఖండించిన భారత్.. ‘తన సొంత భూభాగంలో ఎక్కడైనా భారత్ స్వేచ్ఛగా సమావేశాలు నిర్వహిస్తుంది. చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి సరిహద్దుల వెంబడి శాంతి, సుస్థిరత అవసరం’ అని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సదస్సుకు తుర్కియే, సౌదీ అరేబియా కూడా హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది.
2019లో జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా తొలగించిన తర్వాత జరుగుతున్న కీలక అంతర్జాతీయ సమావేశమిది. 60 మందికి పైగా విదేశీ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారని కేంద్ర టూరిజం కార్యదర్శి అరవింద్ సింగ్ దిల్లీలో మీడియాకు తెలిపారు. దాంతో భద్రతాపరంగా సున్నితమైన ఈ ప్రాంతంలో ఏ చిన్నపాటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్ట ఏర్పాట్లు చేస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) దళాలు, మెరైన్ కమాండోల బృందం, సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఇతర పారామిలటరీ బలగాలను ఇప్పటికే మోహరించారు.