విశాఖలో పెన్షన్ లు రద్దైన వృద్ధులు, వికలాంగులు ఆందోళనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పింఛన్ల తొలగింపుపై తెలుగుదేశం పార్టీ పోరుబాట పట్టనుంది. ఇందులో భాగంగా సోమవారం విశాఖ తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. పెన్షన్లను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహానికి టీడీపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. అనంతరం జీవీఎంసీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తొలగించిన వారికి పెన్షన్ ఇవ్వాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు.
పెద్దఎత్తున పెన్షన్ దారులు, టీడీపీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. కాగా, ధర్మవరంలో ఓ పింఛనుదారుడు ఆవేదనతో గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలాడు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల పింఛన్లు తొలగించగా జిల్లాలో 70వేలకు పైగా తొలగించేశారు. ఈ నేపథ్యంలో నిరుపేద లబ్ధిదారులకు అండగా పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీర్మానించారు. ఈ మేరకు పోరుకు జిల్లా తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు.