ఫ్రెండ్షిప్ డే స్పెషల్.. ‘షోలే’ టు ‘ఆర్​ఆర్​ఆర్’​.. అన్ని బాక్సాఫీస్ హిట్లే!

-

స్నేహం.. జీవితంలో దొరికే ఓ అద్భుత వరం. జీవితంలో ఓ మంచి స్నేహం దొరికితే అంతకంటే కావాల్సిందేం లేదు. అందుకే స్నేహమేరా జీవితం…. స్నేహమేరా శాశ్వతం… అంటూ ఫ్రెండ్​షిప్​ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఎన్నో పాటలు, సినిమాలు వచ్చాయి. ఎందుకంటే స్నేహానికి, సినిమాకి.. క్లాప్‌బోర్డుకి, కెమెరాకి ఉన్నంత అనుబంధం ఉంది. అందుకే బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రమైనా, పాన్‌ ఇండియా ఫిల్మ్‌ అయినా.. కథ ఫ్రెండ్షిప్‌తో దోస్తీ కడితే బొమ్మ బ్లాక్‌బస్టర్‌ అయ్యి తీరాల్సిందే. బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురవాల్సిందే. నేడు స్నేహిదుల దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్​షిప్​ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన హిట్​ సినిమాలేంటో గుర్తు చేసుకుందాం…

కాసులు కురిపించిన బంధం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’..

అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ఆర్‌ఆర్‌ఆర్‌. కథానాయకులవి భిన్న ప్రాంతాలు, భిన్న నేపథ్యాల నుంచి వచ్చినా వాళ్లిద్దరి మధ్య కుదిరిన దోస్తీ కథాంశమే చిత్రాన్ని చివరి వరకూ తీసుకెళ్తుంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు తమ తమ పాత్రల్లో స్నేహాన్ని చక్కగా ప్రదర్శించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ బంధం బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాసింది

కట్టిపడేసే ఆనంద్‌…

ఒక వైద్యుడు, రోగి మధ్య వెల్లివిరిసిన స్నేహంతో అల్లుకున్న కథ ఇది. రాజేష్‌ఖన్నా, అమితాబ్‌ బచ్చన్‌ల మధ్య సంభాషణలు మనసుని పిండేస్తాయి. ఒకరికి కోసం ఒకరు తల్లడిల్లే దృశ్యాలు కంట తడి పెట్టిస్తాయి. హృషికేష్‌ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో క్లాసిక్‌గా నిలిచిపోయింది.

ట్రెండ్‌..’దిల్‌ చాహ్‌తా హై’..

ఈరోజుల్లో స్కూల్‌, కాలేజీ పూర్వ విద్యార్థుల కలయిక సమావేశాలు సాధారణమయ్యాయి. ‘దిల్‌ చాహ్‌తా హై’ సినిమా వచ్చాకే ఈ ట్రెండ్‌ ఊపందుకుందంటే అతిశయోక్తి కాదు. ఫర్హాన్‌ అఖ్తర్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థ నిర్మించింది. ఆమిర్‌ఖాన్‌, సైఫ్‌ అలీఖాన్‌, అక్షయ్‌ఖన్నాలు కథానాయకులు. ఈ కాలేజీ స్నేహితుల మధ్య సాగే సరదా సన్నివేశాలు, ప్రాంక్స్‌తో సాగిపోతుంటుంది.

ఆ మాధుర్యం ‘త్రీ ఇడియట్స్‌’..

రాంచో, రాజు, ఫర్హాన్‌ల మధ్య అల్లుకున్న స్నేహం బాక్సాఫీసు దగ్గర కాసులు కురిపించింది. మార్కులు కాదు.. మానవత్వం, మనుషుల మధ్య స్నేహ బంధం ముఖ్యమని చెబుతూ రాజ్‌కుమార్‌ హిరాణి చెబితే బ్లాక్‌బస్టర్‌ చేశారు ప్రేక్షకులు. ఆమిర్‌ఖాన్‌, మాధవన్‌, శర్మాన్‌ జోషిలు.. ముఖ్య భూమికలు పోషించారు. విధూవినోద్‌ చోప్రా నిర్మాత. ఈ కామెడీ డ్రామాలో స్నేహంలోని మాధుర్యం సైతం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.

దోస్తీ.. ‘షోలే’..

‘యే దోస్తీ.. హమ్‌ నహీ తోడేంగే’ అంటూ ‘షోలే’లో జై, వీరూలు స్నేహం ప్రదర్శిస్తుంటే.. ఆరోజుల్లో స్నేహితులంతా థియేటర్లకి జట్లు జట్లుగా వచ్చి మళ్లీ మళ్లీ చూసేవారట. అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్రలు వారి పాత్రల్లో జీవించారు. కొన్ని దశాబ్దాలపాటు స్నేహానికి ప్రతిరూపంగా భావించిన ఈ సినిమాని రమేష్‌ సిప్పీ తెరకెక్కించారు.

Read more RELATED
Recommended to you

Latest news