ఎడిట్ నోట్: కాపులకి ‘కాపు’..!

-

ఏపీలో రాజకీయాలు కులాల ఆధారంగానే నడుస్తాయనే సంగతి తెలిసిందే. అయితే ఇలా కులాల ఆధారంగా రాజకీయం చేసి..ప్రత్యర్ధులకు చెక్ పెట్టి విజయం సాధించడంలో వైసీపీని మించిన పార్టీ లేదనే చెప్పాలి. గత ఎన్నికల్లో కులాల పరంగా రాజకీయం చేసి ఓట్లు బాగానే కొల్లగొట్టింది. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ అదే తరహాలో ముందుకెళుతూ..నెక్స్ట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని చూస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలు, ఎస్సీల పరంగా ఇప్పటికే రాజకీయం నడిపిస్తున్నారు.

ఇక రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు ఉన్న కాపు కులం టార్గెట్‌గా వ్యూహాత్మకంగా వైసీపీ ముందుకెళుతుంది. గత ఎన్నికల్లో కాపులు మెజారిటీ స్థాయిలో వైసీపీకి మద్ధతు ఇచ్చారు. దీంతో కాపు నేతలు, కాపు ప్రభావిత నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. ఈ సారి కూడా అదే తరహాలో సత్తా చాటాలని చూస్తున్నారు. కానీ పవన్ రూపంలో వైసీపీకి ఇబ్బంది ఎదురైంది. మామూలుగా కొంతమేర టీడీపీని అభిమానించే కాపులు ఉన్నారు. ఇటు పవన్‌కు కాపు వర్గం మద్ధతు ఎక్కువ.

ఈ క్రమంలో టీడీపీతో పవన్ కలిస్తే..మెజారిటీ కాపు ఓట్లు వారికే వెళ్తాయి. దీని వల్ల వైసీపీకి పెద్ద డ్యామేజ్. పైగా గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసి ఓట్లు చీల్చడం వల్ల గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలకు పెద్ద రిస్క్. అందుకే ఎలాగైనా పవన్..టీడీపీతో కలవకుండా చేయడమే లక్ష్యంగా వైసీపీ కాపు నేతల చేత జగన్ కొత్త స్కెచ్‌తో ముందుకొచ్చారు. ఇప్పటివరకు పొత్తు ఉండకూడదని ట్రై చేశారు. కానీ ఇటీవల చంద్రబాబు-పవన్ కలిశారు. దీంతో పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే.

ఈ క్రమంలో పవన్‌ని వైసీపీ కాపు నేతలు టార్గెట్ చేశారు. తాజాగా వైసీపీ కాపు నేతలంతా సెపరేట్‌గా సమావేశం పెట్టుకుని…పవన్‌పై విరుచుకుపడ్డారు. కాపు నేతలని పవన్ బూతులు తిడుతున్నారని, కాపు ఓట్లని బాబుకు తాకట్టు పెడుతున్నారని, జగన్ కాపుల కోసం చాలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే బూతులు ఎవరు తిడుతున్నారో జనాలకు తెలుసు. అలాగే కాపు ఓట్లు టీడీపీ-జనసేనకు వెళ్లకుండా మళ్ళీ వైసీపీకి దక్కేలా చేయడానికి కాపు నేతలు ఎంత కష్టపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఇక కాపు వర్గానికి టీడీపీ హయాంలో ఏం జరిగింది..ఇప్పుడు వైసీపీ హయాంలో ఏం జరిగిందనేది ఆ కాపు ప్రజలకే క్లారిటీ ఉండాలి. కాకపోతే వైసీపీ కాన్సెప్ట్ ఒక్కటే..తమ కాపు నేతల చేత పవన్‌ని టార్గెట్ చేయించి..కాపు ఓట్లు పోనివ్వకుండా చూసుకోవడం. కానీ అది జరిగే పనిలా కనిపించడం లేదు. వైసీపీ కాపు నేతల మాటలని..అదే కాపు వర్గం ఎంతవరకు నమ్ముతుందో తెలియడం లేదు. మొత్తానికి కాపుల ఓట్లు పోకుండా వైసీపీ కాపు నేతలు…కాపు కాయడానికి కష్టపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news