దేశంలో మళ్లీ కరోనా విజృంభణ మొదలైందా

-

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది నెలలుగా తగ్గుముఖం పట్టిన కేసులు.. మళ్లీ పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చేసిందన్న అతి ధీమా, కరోనా వచ్చినా ఏమీ కాదనే ప్రజల నిర్లక్ష్యంతో.. వైరస్ మళ్లీ పడగ విప్పుతోంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలో నమోదవుతున్న కేసులు కలవరం రేపుతున్నాయి. ఇప్పటికే కేంద్రం ఈ మూడు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కరోనాను నియంత్రించాల్సిందేనని, లేకపోతే మళ్లీ గతంలో మాదిరిగా భయానక పరిస్థితులు ఏర్పడుతాయనే ఆందోళన వ్యక్తమౌతోంది.

Maharashtra-Corona
Maharashtra-Corona

దేశవ్యాప్తంగా కరోనా కంట్రోల్‌‌లోకి వస్తున్న వేళ మహారాష్ట్రలో మళ్లీ వైరస్‌‌ భయం పెరుగుతోంది. రెండు వారాలుగా అక్కడ కేసులు ఎక్కువవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఫిజికల్‌‌ డిస్టెన్స్‌‌, మాస్క్‌‌, జనం కదలికలపై ఆంక్షలను పెంచుతున్నారు. ముంబై, పుణే, విదర్భ ప్రాంతాల్లో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో నమోదైన కేసుల్లో 60 శాతం వరకు ముంబై, నాగ్‌‌పూర్‌‌, థానే, అమరావతిల్లోనే నమోదయ్యాయి. అమరావతి జిల్లాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్‌‌ వస్తోందని అధికారులు చెప్పారు.ముంబై ప్రాంతంలో లోకల్‌‌ ట్రైన్స్‌‌ను తిరిగి ప్రారంభించడమే కేసులు పెరగడానికి అసలు కారణమని పలువురు చెబుతున్నారు.

పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కోవిడ్ అనుమానిత లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీ రాజ్ సిబ్బందికి తొలి డోసు కొవిడ్ టీకాను పంపిణీ చేశారు. వైద్య సిబ్బందిలో 58 శాతం మంది మాత్రమే టీకాలను పొందగా మిగిలిన విభాగాల్లో 33 శాతం మందే ఇప్పటివరకూ టీకా పొందారు.

ఒక్క మహారాష్ట్రలోనే కాదు.. కేరళ, కర్ణాటకలో కూడా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఓవైపు వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో.. మళ్లీ వైరస్ విజృంభించడంపై ఆందోళన వ్యక్తమౌతోంది. రికవరీ కంటే కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా ప్రమాద సంకేతమే అంటున్నారు నిపుణులు.

దేశవ్యాప్తంగా కూడా కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రికవరీ కేసుల కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఓవైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పుడు కేసులు తగ్గాల్సిందిపోయి పెరగడం అనేది కచ్చితంగా ప్రమాదకర సంకేతమే. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోకపోతే… కరోనా మళ్లీ విరుచుకుపడే ప్రమాదం లేకపోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news