శ్రీరామనవమి : రాముడి కళ్యాణం జరిగింది ఇక్కడే !

-

రామకథే రామాయణం. కేవలం శ్రీ సీతారాముల చరిత్రనే కాదు ఇది సమాజం ఉండే జీవినవిధానాన్ని తెలిపే మహా కావ్యం. అయితే రామాయణంలో ప్రధానఘట్టాలలో రామకళ్యాణం ఒకటి. అయితే ఈ కళ్యాణం ఎక్కడ జరిగిందీ ? ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం….

జనకుడి రాజ్యంలో కళ్యాణం !

రాముడి మామగారి రాజ్యమే మిథిల. రాముడి మామగారు జనకుడు. ఆయన పాలించే రాజ్యమే మిథిల. ఒకప్పుడు బీహార్ నుంచి నేపాల్ వరకూ ఈ మిథిలా రాజ్యం విస్తరించి ఉందని చెబుతారు. సీతమ్మ తల్లి జన్మించింది ఆ మిథిలా రాజ్యంలోనే.

నేటి జనక్పురి నాటి వైదేహీ రాజ్యం !

ఎప్పుడో వేదకాలం నుంచే మిథిలా రాజ్యం ఉండేదని చరిత్రకారులు ఒప్పుకొంటున్నారు. ఈ రాజ్యాన్ని విదేహ రాజ్యం అని కూడా పిలిచేవారట. ఆ పేరు మీదుగానే సీతమ్మకు వైదేహి అన్న పేరు వచ్చింది. అప్పట్లో జనకుడి రాజధానే ఇప్పటి నేపాల్లో ఉన్న జనక్పురి అని ప్రజల నమ్మకం. ఈ జనక్పురిలోని భూమిని దున్నుతుండగానే సీతమ్మ తల్లి కనిపించిందని చెబుతారు. సీతమ్మ తల్లి పెరిగి పెద్దదయ్యిందీ, రాముని కళ్యాణం చేసుకున్నదీ ఈ నగరంలోనేనని  భక్తులు విశ్వసిస్తారు.

జానకీ మందిర్

సీతాదేవి జన్మించిన ప్రాంతం ఇదేనన్న విషయం కాలక్రమేణా ప్రజలు మర్చిపోయారు. సుర్కిశోర్దాస్ అనే సన్యాసికి 1657లో ఇక్కడ సీతాదేవి విగ్రహాలు లభించడంతో, ఇక్కడి ప్రజలు తమ చరిత్రను తిరిగి గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు. ఆ చరిత్రకు చిహ్నంగా 1910లో వృషభాను అనే నేపాల్ రాణి ‘జానకీ మందిర్’ పేరుతో ఒక భారీ ఆలయాన్ని నిర్మించారు. వేల గజాల విస్తీర్ణంలో, 150 అడుగుల ఎత్తున్న ప్రాకారంతో, పాలరాతి గోడలూ, అద్దాల మేడలతో నిర్మించిన ఈ ఆలయానికి తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చయిందట. అందుకనే ఈ ఆలయానికి ‘నౌ లాఖ్ మందిర్’ అన్న పేరు కూడా ఉంది. జానకీమందిర్ నిర్మించిన ప్రాంతంలోనే సీతాదేవి శివ ధనుస్సుని పూజించిందని చెబుతారు. సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ స్థలంలోనే అని భక్తుల నమ్మకం. అందుకనే జానకీమందిరంలోని నైరుతి దిక్కున పెద్ద వివాహ మండపాన్ని నిర్మించారు. ఏటా మార్గశిర మాసం శుక్ల పంచమి రోజున ఇక్కడ వైభవంగా సీతారామ కళ్యాణం నిర్వహిస్తారు. ఆ రోజే సీతారాముల వివాహం జరిగిందని అక్కడి ప్రజల నమ్మకం.  కానీ తెలుగువారు శ్రీరామనవమి రోజునే ఆయన కళ్యాణం నిర్వహించుకోవడం ఇక్కడి ఆనవాయితీగా వస్తుంది.

 ఘనంగా శ్రీరామనవమి వేడుకలు !

ఇక్కడ ఆలయంలో జరిగే పండుగల వివరాలు పరిశీలిస్తే… ఆలయంలో కొలువైన సీతాసమేత రామునీ… అతని సోదరులైన లక్ష్మణ, భరత శత్రుఘ్నులని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఇక్కడ కొలువైన సీతారాములని దర్శించి, వారి ఆశీస్సులను వేడుకునేందుకు నిత్యం వేలమంది జనం వస్తుంటారు. ఇక శ్రీరామనవమి, దసరా, సంక్రాంతి (తిహార్), వివాహ పంచమి (మార్గశిర శుక్ల పంచమి) పండుగలలో అయితే జనం పోటెత్తుతారు. ఇక్కడి ఉత్సవాలూ ఘనంగా జరుగుతాయి. ఇదీ జనక్పురి ప్రత్యేకత. రామాయణంతో ఈ ప్రాంతానికి ఉన్న సంబంధం దృష్ట్యా రామభక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే తప్ప తమ తీర్థయాత్రలు సంపూర్ణం కావని భావిస్తుంటారు. కొందరైతే ఈ నగరం చుట్టూ ప్రదక్షిణం కూడా చేస్తుంటారు. ఈ జనక్పురికి 18 కిలోమీటర్ల దూరంలో ‘ధనుషధామ్’ అనే ప్రాంతం ఉంది. రాముడు విరిచిన శివుని ధనుస్సు ఇక్కడే పడిందని భక్తుల నమ్మకం. అందుకే జనక్పురికి వెళ్లినవారు ధనుషధామ్కు కూడా వెళ్లివస్తుంటారు. అదండీ సంగతి. రాముడి కళ్యాణం జరిగిన ప్రాంతమే జనకుర్సి. ఈసారి నేపాల్‌ వెళ్లినప్పుడు తప్పకుండా ఈ క్షేత్రాన్ని సందర్శించి సీతారాముల కృపను పొందండి.

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news