దెయ్యం భయంతో.. 42 ఏళ్లుగా మూతపడిన రైల్వే స్టేషన్‌

-

టెక్నాలజీ విపరీతంగా పెరుగుతున్న ఈరోజుల్లో కూడా.. కొన్ని మూఢనమ్మకాలను మనుషులు ఇంకా బలంగా నమ్ముతున్నారు. సైన్స్‌కు, సంప్రదాయాలకు నేటికి సమాధానం దొరకని ప్రశ్నలు చాలా ఉన్నాయి. దెయ్యాల భయంతో 42 ఏళ్లుగా ఓ రైల్వేస్టేషన్‌ మూతపడింది.. అన్ని ఏళ్లుగా మూతపడిందంటే.. అక్కడ దెయ్యాలు ఉండే ఉంటాయేమో..! అసలు ఆ కథ ఏంటి..? ఇంతకీ ఈ రైల్వేస్టేషన్‌ ఎక్కడ ఉందో చూద్దామా..!

పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలోని బేగుంకోదర్ రైల్వేస్టేషన్‌(Begunkodar railway station) 1960లలో నిత్యం రద్దీతో సందడిగా ఉండేది.. ఈ స్టేషన్ సంతాల్ రాణి లచన్ కుమారి కృషితో నిర్మించబడింది. మారుమూల ప్రాంతంలోని ఈ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన తర్వాత చుట్టుపక్కల ప్రజలకు చాలా సంతోషించారు.. ఈ ప్రాంతం దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడింది. కానీ..వాళ్ల ఆనందం ఎక్కవ రోజులు నిలవలేదు..1967లో ఈ స్టేషన్‌లోని ప్రస్తుత స్టేషన్‌ మాస్టర్‌ తనకు రైల్వే ట్రాక్‌పై దెయ్యం కనిపించిందని చెప్పారు. స్టేషన్ మాస్టర్ చెప్పేదాని ప్రకారం..దెయ్యం తెల్లటి చీరలో ఉంది. ఆమె రాత్రి రైల్వే ట్రాక్‌పై తిరుగుతుంది. ఈ పుకారు త్వరగా ఆ ప్రాంతమంతా వైరస్‌ కన్నా స్పీడ్‌గా వ్యాపించింది.

అంతే.. ఆ తర్వాత చాలా మంది వ్యక్తులు తెల్లచీరలో దెయ్యాన్ని చూశారని పేర్కొన్నారు. ఈ రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్న బాలికే దెయ్యంగా మారిందని ప్రజలు చెప్పడం ప్రారంభించారు. భారతీయ రైల్వేలో 20 ఏళ్లకు పైగా పనిచేసిన సుభాశిష్ దత్తా రాయ్ ఈ స్టేషన్‌కు సంబంధించిన వివరణాత్మక కథనాన్ని రాశారు. దెయ్యం భయం కారణంగా ఏ రైల్వే కార్మికుడు ఈ స్టేషన్‌లో పనిచేయడానికి సిద్ధంగా లేడని, ఆ పై రైల్వే మొత్తం 42 సంవత్సరాల పాటు దీనిని మూసివేయాల్సి వచ్చిందని…నేటికీ, రైళ్లు ఈ స్టేషన్ గుండా వెళుతున్నప్పుడు, రైలు లోపల నిశ్శబ్దం ఉంటుంది. సాయంత్రానికి స్టేషన్‌ నిర్మానుష్యంగా మారుతుందని తెలిపారు..

అనుమానాస్పద స్థితిలో స్టేషన్‌ మాష్టర్‌ కుటుంబం మృతి..

రైల్వే యంత్రాంగం ఈ పుకార్లను విశ్వసించనప్పటికీ.. ఆ క్రమంలోనే.. స్టేషన్ మాస్టర్, అతని కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటన తర్వాత దెయ్యం అనే పుకారు షికారు చేసింది.. స్టేషన్ మాస్టర్ మరణానంతరం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా పని చేసేందుకు నిరాకరించారు. అప్పుడు ఈ స్టేషన్‌లో రైల్వే ఉద్యోగి ఎవరూ లేరు. దీంతో ఈ స్టేషన్‌లో రైళ్లు నిలిచిపోయాయి. ఆ తర్వాత కొన్ని నెలలుగా ఇక్కడ ఉద్యోగులను మోహరించేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తూనే ఉంది, కానీ ఉద్యోగులెవరూ వెళ్లేందుకు సిద్ధంగా లేరు.

ఇక చేసేదేం లేక.. రైల్వేశాఖ.. ఒకరోజు రైల్వే ఈ స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్టేషన్‌లో అన్ని సర్వీసులను నిలిపివేసిన తర్వాత, ఇది వాస్తవ రూపంలో దెయ్యం స్టేషన్‌గా మారింది. ఈ స్టేషన్‌ మీదుగా రైలు వెళ్లినప్పుడు రైళ్లలోని ప్రయాణికులు భయాందోళనకు గురవుతారట.. సాయంత్రం వేళ స్థానిక ప్రజలు సైతం ఈ స్టేషన్‌కు వచ్చేందుకు భయపడతారు..

1990వ దశకంలో ఈ స్టేషన్‌ను పునఃప్రారంభించాలని కొందరు స్థానికులు డిమాండ్ చేశారు. ఈ స్టేషన్‌ను తెరవాల్సిన అవసరం గురించి రైల్వే కూడా ఆలోచించింది.. దాదాపు 42 ఏళ్ల తర్వాత ఆ సమయం వచ్చింది. 2009లో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ చొరవతో ఈ స్టేషన్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఇక్కడ ఓ ప్యాసింజర్ రైలు ఆగడం ప్రారంభమైంది…నేటికీ ఈ స్టేషన్ హాల్ట్ స్టేషన్‌గా పని చేస్తుంది. ఒక ప్రైవేట్ వెంటింగ్ కంపెనీ దీనిని నిర్వహిస్తోంది. ఈరోజుకి ఇక్కడ ఒక్క ఉద్యోగి లేడు.

మొత్తానికి ఒక పుకారు కారణంగా రైల్వేస్టేషన్‌ 42 ఏళ్లుగా మూతపడి ఉంది.. అది పుకారో లేక నిజమే ఆ పైవాడికే తెలియాలి..!

Read more RELATED
Recommended to you

Latest news