కేసీఆర్ కే  దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా ఉంది: బండ్ల గణేష్

-

కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే కాదు, మొత్తం భారత దేశాన్నే ప్రగతిపథం వైపు నడిపించే సత్తా కేసీఆర్ కు ఉందంటూ నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేశ్ వ్యక్తపరిచారు. వరుస ట్వీట్లతో బండ్ల గణేష్ సీఎం కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. మంగళవారం యాదాద్రి వెళ్లిన బండ్ల గణేశ్.. కుటుంబంతో కలిసి యాదాద్రీశుడి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో శిల్పకళా సంపదను చూసి తాను అచ్చెరువు పొందినట్లు వెల్లడించారు. యాదాద్రిని అత్యద్భుతంగా తీర్చిదిద్దినందుకు తెలంగాణ ప్రజల తరఫున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

తెలంగాణ ప్రగతి పథం వైపు దూసుకుపోతుందని చెప్పటానికి యాదాద్రి ఓ ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు గాని ఆయన ఆలోచన విధానం గానీ మహా అద్భుతమని పొగిడారు. చాలా రోజుల నుంచి యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకోవాలని అనుకున్నానని, స్వామి వారి అనుగ్రహం లేకపోవడంతో కుదరలేదని బండ్ల గణేశ్ వ్యక్తపరిచారు.

దేశంలోని చిన్న రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని, దీనికి కేవలం కేసీఆర్ ఆలోచన విధానం, కఠోర తపస్సు ఉపయోగపడ్డాయని అన్నారు బండ్ల గణేశ్. నరసింహ స్వామి కరుణాకటాక్షం ఎల్లప్పుడూ కేసీఆర్ పై ఉండాలని కోరుకున్నానని చెప్పారు. కేసీఆర్ దగ్గరి నుంచి ఏదో ఆశించి తానీ విషయాన్ని చెప్పట్లేదని, ఆయన చేసిన మంచిని బయటకు చెప్పానని స్పష్టం చేశారు. దేశానికి భవిష్యత్తు చూపగల సత్తా ఉన్న నేత కేసీఆర్ అని, ఆయన మహోన్నత వ్యక్తి అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news