చిరంజీవితో ‘ఆటో జానీ’ సినిమా.. పూరి జగన్నాథ్ ఏమన్నారంటే?

-

మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలనేది ప్రతి దర్శకుడి కల. వారిలో పూరి జగన్నాథ్ మినహాయింపు కాదు. చిరుతో మూవీ తీయాలని పూరి చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కానీ సరైన కథ దొరక్క.. దొరికిన కథ చిరుకి నచ్చక ఇప్పటికి ఈ కాంబినేషన్ పట్టాలెక్కలేదు. అయితే చిరంజీవి హీరోగా పూరి జగన్నాథ్ ‘ఆటో జానీ’ అనే కథను తెరకెక్కించడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. చిరంజీవి స్క్రిప్ట్‌తో కన్విన్స్ కాకపోవడం వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇన్నాళ్లకు ‘ఆటో జానీ’ పేరు మళ్లీ వినిపించింది. కానీ ఈసారి పూరి నోట కాదు.. చిరు నోటి నుంచి ఈ సినిమా పేరు రావడం విశేషం.

‘గాడ్ ఫాదర్’ సక్సెస్ సందర్భంగా పూరి జగన్నాథ్‌తో జరిగిన సంభాషణలో చిరంజీవి ‘ఆటో జానీ’ ప్రస్తావన తెచ్చారు. ‘ఆటో జానీ స్క్రిప్ట్ ఎంతవరకు వచ్చింది? ఉందా? చించి పక్కన పడేశారా?’ అని చిరంజీవి అడిగినప్పుడు ‘ఆటో జానీ పక్కన పడేశా.. మళ్లీ కొత్తగా స్క్రిప్ట్ రాసుకుని వస్తా. అది కొంచెం అవుట్ డేటెడ్ అయినట్లు అనిపించింది.’ అని పూరి బదులిచ్చారు. ‘నీ తర్వాతి సినిమాకు వచ్చి క్లాప్ కొట్టమన్నా నేను వస్తాను. నువ్వు మంచి స్క్రిప్టుతో వస్తే మనం కలిసి సినిమా చేద్దాం.’ అని చిరంజీవి అన్నారు.

‘గాడ్ ఫాదర్’ విజయంతో జోరు మీదున్న మెగాస్టార్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. మరోవైపు మంచి టాక్ అందుకున్న ఈ మూవీ వీక్ డేస్ లోనూ నిలకడ వసూళ్లు రాబడుతోంది. ఉత్తరాదిన కూడా మంచి కలెక్షన్లు వస్తుండటంతో సినిమాను టీమ్ ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉంది. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ కూడా కీలక పాత్రలో కనిపించారు. జర్నలిస్ట్‌ గోవర్ధన్‌ అనే కీలక పాత్రలో కనిపించారు పూరి. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ ద్వారా మెగాస్టార్‌ను పూరి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలోనే చిరు.. ‘ఆటో జానీ’ సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు.

మరోవైపు చిరు.. బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’, మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాల్లో నటిస్తున్నారు. వీటిలో వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి, భోళా శంకర్ 2023 వేసవికి విడుదల కానుంది. వీటికి సంబంధించిన రిలీజ్ డేట్స్‌ను కూడా అఫీషియల్‌గా ప్రకటించారు.

ఇక పూరి జగన్నాథ్.. ‘లైగర్’ అందించిన వైఫల్యంతో విజయ్ దేవరకొండతో తీయాల్సిన ‘జనగణమన’ కూడా పక్కన పెట్టేశాడు. మరి పూరి తన తర్వాతి సినిమాకు ఏ హీరోను అప్రోచ్ అవుతాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news