ఉద్యోగులకు సీఎం కేసీఆర్ కొత్త సంవత్సరం కానుక అందుకేనా ?

-

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ కొత్త సంవత్సరం కానుక ప్రకటించారు. ఉద్యోగుల వేతనాలతో పాటు పదవీ విరమణ వయస్సు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లోని ఉద్యోగుల వేతనాలతో పాటు పెన్షనర్లకు ఇచ్చే పింఛను పెంచేందుకు సీఎం ఆమోదం తెలిపారు. దీంతో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు.సడన్ గా ఉద్యోగుల పై కేసీఆర్ దృష్టిపెట్టడం పై ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ఉద్యోగులు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ వర్కర్లు అందరికీ భారీ న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించారు సీఎం కేసీఆర్. నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు.

ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా సాలరీస్ పెంచాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపువల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్నిరకాల ఉద్యోగుల కలిపి తెలంగాణలో 9 లక్షల 36 వేల 976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం లాంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరి లోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకనున్నారు. అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు.

ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని ముఖ్యమంత్రి నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుంచి అందిన నివేదికను అధ్యయనం చేస్తుంది. రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతుంది. అన్ని అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అనంతరం క్యాబినెట్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది.

రెండవసారి కేసీఆర్ సీఎం అయ్యాక ఉద్యోగ వర్గాలను,నిరుద్యోగులను పట్టించుకోలేదని వారి డిమాండ్లని పెడచెవిన పెట్టారన్న టాక్ చాలా రోజులుగా నడుస్తుంది.అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్స్,గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ,దుబ్బాక,గ్రేటర్ ఎన్నికలను పరిశీలిస్తే ఉద్యోగులు ప్రభుత్వానికి దూరమైనట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇక రానున్న సవాళ్లు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు,పెరుగుతున్న బీజేపీ ప్రభావంతో మళ్లీ ఉద్యోగులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు కేసీఆర్.అదే ఇప్పుడు కొత్త సంవత్సర కానుక ఉద్యోగులు,నిరుద్యోగులకు అందిచారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news