గ్రేటర్‌ కార్పోరేటర్లలో అనర్హత వేటు బయం పట్టుకుందా

-

గ్రేటర్‌ కార్పోరేటర్లలో కొత్త భయం పట్టుకుందట..గెలిచి నెల కావస్తున్న ఇంతవరకు కార్పోరేటర్ గా ప్రమాణం చేయలేదన్న బెంగ ఒకపక్క వెంటాడుతుంటే మరో పక్క పోటీ చేసిన జమ ఖర్చులు వెల్లండించలేదని ఎలక్షన్ కమీషన్ టెన్షన్ పెడుతుందట..పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూ ఇంకా ఖర్చుల లెక్కలు వెల్లడించలేదు. గడువు సమీపిస్తున్నా.. వాటితో కుస్తీ పడుతున్నారు. లెక్క తేలడం లేదో.. లెక్కలు లేవో కానీ ఎస్ఈసీ ఎక్కడ అనర్హత వేస్తుందోనని ఆందోళన చెందుతున్నారట.


బల్దియా ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 1122 మంది పోటీ చేశారు. వీరంతా ఎన్నికలు ముగిసిన 45 రోజులలోపు ఎన్నికల ఖర్చుల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయాలి. ఆ వివరాలు ఇవ్వకపోతే అనర్హత వేటు పడుతుంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలు ముగిసి నెలరోజులు దాటిపోయింది. ఆ గడువు కూడా సమీపిస్తోంది. అయినా ఇంత వరకు ఒక్కరంటే ఒక్కరూ లెక్క చూపించలేదట.

ఒక్కో కార్పొరేటర్‌ అభ్యర్థి నిబంధనల ప్రకారం 5 లక్షల వరకు ఖర్చు చేయాలి. ఇందులో కూడా దేనికెంతో ఒక లెక్క ఉంటుంది. అలాగే ఎస్ఈసీ నియమించిన వ్యయ పరిశీలకుడు కూడా ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. వారి దృష్టికి వచ్చిన ప్రచార ఆర్భాటపు ఖర్చును అక్కడి అభ్యర్థుల అకౌంట్‌లో వేశారు. ఇలాంటి వాటిని తీసి మిగతా ఖర్చును చూపించాల్సి ఉంటుంది. అభ్యర్ధులుకు ఆ సమయంలోనే కొన్ని ధరల జాబితాను అధికారులు అందజేశారు. అభ్యర్థి వేసుకునే కండువాకు 20, మాస్క్‌కు 20 చొప్పున లెక్క కట్టారు. ప్రచారంలో టిఫిన్‌ తింటే నాలుగు ఇడ్లీలకు 20, నాలుగు వడలకు 20, ఆలూ సమోసాకు 10, ఇరానీ సమోసాకు 3 రూపాయల చొప్పున ధరలను నిర్ధారించారు. ప్రచారంలో ఉపయోగించిన టాటా ఇండికా కారుకు డ్రైవర్‌ బత్తాతో కలిపి రోజుకు 1200, ఆటోకు 300, బస్‌ అయితే 3వేల 900 ఇలా జెండాలు.. జెండా కర్రలకు కూడా రేట్‌ ఫిక్స్‌ చేసింది ఎస్ఈసీ.వీటికయ్యే ఖర్చు 5 లక్షలు మించకూడదు.

ఎన్నికల సంఘం పరిశీలకులు కూడా అభ్యర్థుల ఖర్చులు లెక్కపెట్టారు. వారు ఇచ్చిన ఖర్చుల వివరాలతో.. అభ్యర్థులు సమర్పించే లెక్కలు సరిపోలాల్సి ఉంటుంది. ఒకవేళ గడువు లోగా ఖర్చుల వివరాలు ఇవ్వకపోతే మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉండదు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా 1800 మంది ఎన్నికల వ్యయ వివరాలను సకాలంలో ఇవ్వలేదు. దాంతో 2019లో నిర్ణయం తీసుకుని వారిపై అనర్హత వేటు వేశారు. వీరిలో కొందరు 2021, మరికొందరు 2022 వరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు.

ఈదఫా గెలిచిన కార్పొరేటర్లది వింత పరిస్థితి. హంగ్‌ ఏర్పడటంతో కొత్త పాలకవర్గం ఎప్పుడు ఏర్పాటవుతుందో.. అసలు కొలువు తీరుతుందో లేదో తెలియదు. పైగా గెలిచిన అభ్యర్ధుల గెజిట్‌ విడుదల కాలేదు. బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఇదే అంశంపై ఆందోళన బాట పట్టారు. అందరిలోనూ టెన్షన్‌ నెలకొంది. ఈ ఎన్నికల్లో గెలిచిన వారు ఇంట్లో నాలుగు గోడల మధ్య ఆవేదన చెందుతుంటే.. ఓడినవారు బహిరంగంగానే విలపిస్తున్నారు. మరి..ఈ సంకట స్థితిలో ఎన్నికల ఖర్చు లెక్కలు ఇచ్చి వేటు నుంచి తప్పించుకుంటారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news