జీహెచ్‌ఎంసీ ముందస్తు ఎన్నికలు కష్టమేనా…?

-

జీహెచ్ ఎంసీ ఎన్నికల విషయంలో అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటా? అధికార పార్టీలో.. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. ప్రస్తుత కౌన్సిల్‌ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగుస్తుంది. GHMC చట్టం ప్రకారం పదవీకాలం ముగిసే సమయానికి 3 నెలల ముందుగానే ఎన్నికలు జరుపుకొనే వెసులుబాటు ఉంది. ఆ మేరకు నవంబర్‌, డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్‌ వేసుకుంది. అయితే అంతా తలకిందులైందనే చర్చ జోరందుకుంది.

అకాల వర్షాలు, వరదలతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నట్టు అనుమానిస్తున్నారట. వరద ప్రభావిత ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పర్యటిస్తుంటే జనాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖం మీదే కడిగేస్తున్నారు. నిరసనలకు దిగుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రభుత్వ యంత్రంగంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. సహాయ చర్యల విషయంలో జీహెచ్ ఎంసీ తోపాటు వివిధ ప్రభుత్వ శాఖలు విఫలమయ్యాయని జనం ఫైర్‌ అవుతున్నారు.

ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు తగ్గట్టుగా గ్రేటర్‌లో పరిస్థితులపై టీఆర్‌ఎస్‌ ఆరా తీసింది. సిట్టింగ్‌ కార్పొరేటర్ల పనితీరుతోపాటు ఆయా డివిజన్లలో ఉన్న రాజకీయ పరిస్థితులను, పరిష్కరించాల్సిన సమస్యలను, కొత్తగా ఇవ్వాల్సిన హామీలపై సమాచారం కోసం 18 మంది ఇంఛార్జ్‌లను నియమించింది అధికార పార్టీ. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఓ నివేదిక కూడా అందింది. మరో రెండు సర్వేలకు సిద్ధమవుతోంది. ప్రారంభోత్సవాల స్పీడ్‌ పెరిగింది. మరి.. ఇప్పుడేం జరుగుతుంది? అన్నదే మిలియ్‌ డాలర్ల ప్రశ్నగా ఉంది.

వరదల తర్వాత గ్రేటర్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై టీఆర్‌ఎస్‌ పునరాలోచన చేసే అవకాశం లేకపోలేదు అని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయట. కాదూ కూడదని ఎన్నికలకు వెళ్తే రాజకీయంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని.. సిటీలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే పురపోరుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వొచ్చని ప్రచారం మొదలైంది. వరదల నుంచి జనం తేరుకున్నాక మరోసారి గ్రేటర్‌లో రాజకీయ పరిస్థితులపై అంతర్గత సర్వేలకు వెళ్లే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు. అప్పుడే జీహెచ్ ఎంసీ ఎన్నికలు ఉండొచ్చని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news