Breaking : గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ

-

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో 11వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు పరీక్ష ఉండదని వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో వారి చాయిస్ మేరకు పరీక్షలు రాయవచ్చు. జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్‌ మినహా మిగతా అన్ని పేపర్‌లకు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో పరీక్ష రాసుకోవచ్చని పేర్కొంది. కాగా, గత ఏడాది అక్టోబర్ 16న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

అయితే, గ్రూప్‌-1 ద్వారా మొత్తం 503 పోస్టులను భర్తీ చేయనున్న టీఎస్‌పీఎస్‌సీ ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు తీసుకుంది. అంటే ప్రిలిమ్స్‌కు హాజరైన వారి నుంచి 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్‌ పరీక్షకు ఎంపిక చేసింది.

కాగా, టీఎస్‌పీఎస్‌సీ షెడ్యూల్‌ ప్రకారం.. జూన్‌ 5న జనరల్‌ ఇంగ్లిష్‌ (అర్హత పరీక్ష), జూన్‌ 6న జనరల్‌ ఎస్సే (పేపర్‌-1), జూన్‌ 7న హిస్టరీ, కల్చర్‌ అండ్‌ జాగ్రఫీ (పేపర్‌-2), జూన్‌ 8న ఇండియన్‌ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్‌ అండ్‌ గవర్నెన్స్‌ (పేపర్‌-3), జూన్‌ 9న ఎకానమీ అండ్‌ డెవలప్‌మెట్‌ (పేపర్‌-4), జూన్‌ 10న సైన్స్‌ & టెక్నాలజీ అండ్‌ డాటా ఇంటర్‌ప్రిటేషన్‌ (పేపర్‌-5), జూన్‌ 12న తెలంగాణ ఉద్యమం అండ్‌ రాష్ట్ర ఆవిర్భావం (పేపర్‌-6) అంశాలపై పరీక్షలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news