నేను చదివిన యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందడం సంతోషంగా ఉంది: జస్టిస్ ఎన్వి రమణ

-

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. యూనివర్సిటీలో జరిగే 37, 38వ నాతకోత్సవంలో ఎన్ వి రమణకు గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ డాక్టరేట్ అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ..నేను చదివిన యూనువర్శిటీ నుంచే గౌరవ డాక్టరేట్ పొందడం సంతోషంగా ఉందన్నారు. ఆచార్య నాగార్జున సిద్దాంతాల స్పూర్తితో యూనివర్శిటీని స్థాపించారని.. గత నాలుగు దశాబ్దాలుగా నాగార్జున యూనివర్శిటీ విద్యా రంగానికి ఎన్నో సేవలందించిందని అన్నారు.

అన్ని రకాల అసమానతలు తొలగాలంటే విద్యా రంగమే కీలకమన్నారు ఎన్వి రమణ. ఎంతో మేథో మధనం తర్వాత 2009లో విద్యా హక్కు చట్టం వచ్చిందన్నారు. హ్యుమానిటీ, చరిత్ర వంటి సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. హోలిస్టిక్ విద్యా విధానం ఉన్నప్పుడే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నారు. ఈ యూనివర్శిటీలో ఉన్న ఎంప్లాయీస్ అసోసియేషన్ కారణంగానే నేను ఇక్కడ చేరానని తెలిపారు. అసోసియేషన్ నేతలు వచ్చి పట్టు పట్టడంతో లా స్టూడెంటుగా చేరినట్లు తెలిపారు.

యూనివర్శిటీలో మా అడ్డా క్యాంటీనే…క్యాంటీనులో కూర్చొని అనేక విషయాలపై చర్చించే వాళ్లమని గుర్తు చేసుకున్నారు. లా కాలేజీ వల్ల మిగిలిన విద్యార్ధులు చెడిపోతున్నారని.. మా కాలేజీని తరలించాలనే ప్రతిపాదన జరిగిందన్నారు. నాడు వివిధ అంశాలపై యువతలో జరిగిన చర్చ ఇప్పుడు జరగడం లేదన్నారు జస్టిస్ ఎన్వి రమణ. సమస్యలపై యువత స్పందించకపోవడం సమాజానికి మంచిది కాదన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా విద్యా విధానం ఉండాలని ఆకాంక్షించారు.

యూనివర్శిటీలు రీసెర్చ్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నారు. రీసెర్చ్ వింగ్ కోసం యూనివర్శిటీలు కూడా అవసరమైన మేరకు బడ్జెట్ కేటాయింపులు జరపాలని సూచించారు. సమాజం కోసం.. సమాజ అవసరాల కోసం పౌరులను తయారు చేసేలా విద్యా విధానం ఉండాలన్నారు. యూనినర్శిటీకి అవసరమైన నిధులిచ్చేలా మంత్రి బొత్స చొరవ తీసుకుంటారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news