కవిత మెరుపులు..బాబు తొత్తు..బాణంతో తామర పువ్వులు.!

-

ఇంతకాలం కాస్త సైలెంట్‌గా కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఇటీవల దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు వచ్చిందో అప్పటినుంచి ఆమె రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. లిక్కర్ స్కామ్‌లో తనని టార్గెట్ చేస్తున్న వారికి కౌంటర్లు ఇస్తున్నారు. మొన్న ఆ మధ్య కాంగ్రెస్‌లో చేరడానికి కవిత ఖర్గేతో మాట్లాడారని బీజేపీ ఎంపీ అరవింద్ మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై కవిత తీవ్ర స్థాయిలో స్పందించారు..అరవింద్‌ని తంతామని, చెప్పుతో కొడతామని, చంపుతామని ఫైర్ అయ్యారు.

ఇక కవిత తన ఫైర్ కొనసాగిస్తున్నారు..తాజాగా నవంబర్ 29న దీక్షా దివస్ సందర్భంగా అప్పటిలో తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ చేసిన దీక్షని, ఉద్యమాన్ని గురించి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది కేసీఆర్ వల్లే అంటూ టిఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్‌ను గుర్తు చేశారు. ఇది దొంగ దీక్ష అని, దగా దివస్ అంటూ తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు. దొంగ దీక్షతో ఉద్వేగాలను రెచ్చగొట్టి, యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినమని మండిపడింది.

దానికి కవిత కౌంటర్ ఇస్తూ.. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారని కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి.. “ వంటావార్పులో పప్పన్నం తిన్నందుకే… బతుకమ్మ ఆడినందుకే… బోనం కుండలు ఎత్తినందుకే … మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే… తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలనేమనాలి!?” అని ట్వీట్ చేశారు.

దీనికి కౌంటరుగా కవిత.. “చంద్రబాబు తొత్తుగా ఉంటూ ఉద్యమకారుల పై “ తుపాకీ ”ఎక్కుపెట్టిన వారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళల పాత్రను కేవలం పప్పన్నం , బోనం మరియు బతుకమ్మకు పరిమితం చేస్తూ మాట్లాడడం మహిళల పట్ల మీ పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోంది.” అని ట్వీట్ చేశారు. ఇలా వారి మధ్య ట్విట్టర్ వార్ జరిగింది.

ఇక తాజాగా వైటీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడం, షర్మిలని అరెస్ట్ చేయడాన్ని బీజేపీ నేతలు ఖండించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణలు తీవ్రంగా ఖండించారు. గవర్నర్ సైతం షర్మిలకు మద్ధతు తెలిపారు. దీనిపై కూడా కవిత కౌంటర్ వేశారు. “తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు” అంటే బీజేపీ వదిలిన బాణమే షర్మిల అన్నట్లు కౌంటర్ ఇచ్చారు.

ReplyForward

Read more RELATED
Recommended to you

Latest news