కాళేశ్వరం కట్టి వేల కోట్లు దండుకున్నారు : మహేష్ కుమార్ గౌడ్

-

మరోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారని అన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణను లూఠీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో గడీల పాలన సాగుతోందని, పనికిరాదని తెలిసినా కాళేశ్వరం కట్టి వేల కోట్లు దండుకున్నారని సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్. భూములన్నీ కేసీఆర్ కుటుంబసభ్యుల సొంతం అవుతున్నాయని తెలంగాణ వచ్చాక రాష్ట్రం బంగారుమయం కాకపోగా.. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారం అయ్యిందన్నారు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని.. బీఆర్ఎస్‭ను ఇంటికి పంపిస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చూస్తుంటే ఆనాటి వైఎస్ యాత్ర గుర్తొస్తుందని చెప్పారు. అనంతరం మల్లు రవి మాట్లాడుతూ.. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కసిగా ఉన్నారని మాజీ ఎంపీ మల్లురవి అన్నారు. రేవంత్ పాదయాత్ర చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరంగల్ రైతు డిక్లరేషన్‭ను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రూ.500కే పేదలకు గ్యాస్ అందిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకుంటుందని మల్లురవి ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news