స్థానిక నివాస గుర్తింపు లేకపోయినా.. రోగికి చికిత్స అందించాలి: సుప్రీంకోర్టు

-

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజూ లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. మెరుగైన చికిత్సలు అందలేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టు స్పందించింది. కోవిడ్ విపత్కర పరిస్థితిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా చాలా మంది వలస వస్తుంటారు. వీరికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక గుర్తింపు ఉండదు. అలాంటి వారికి కరోనా సోకి బాధపడుతున్నట్లయితే కొన్ని ఆస్పత్రులు స్థానిక గుర్తింపు పత్రాలు, ధ్రువీకరణ పత్రాలను అడుగుతున్నాయి. దీంతో చాలా మంది నిస్సహాయులు ఇంటికే పరిమితమవుతున్నారు. అలా చికిత్స అందలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటోంది.

సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు

దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏర్పడింది. రెండు వారాల్లోగా ఆస్పత్రుల్లో ప్రవేశాలపై జాతీయ విధానాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలని ఆదేశించింది. అప్పటివరకు స్థానిక గుర్తింపు లేని కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో బెడ్ల సౌకర్యం, చికిత్స, మందులు అందించాలని తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో చాలా మంది ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య.. ఆస్పత్రుల్లో ప్రవేశం పొందకపోవడం, తగిన చికిత్స, బెడ్లు దొరకకపోవడమని అత్యున్నత న్యాయస్థానం తన ఉత్వర్వుల్లో పేర్కొంది. బాధితులు తమ సొంతూరికి వెళ్లలేక చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. వివిధ రాష్ట్రాలు, స్థానిక వైద్య అధికారులు తమ స్వంత ప్రోటోకాల్‌లను అనుసరిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో ప్రవేశానికి భిన్నమైన ప్రమాణాలు గందరగోళానికి దారి తీస్తున్నాయి.

విపత్తు నిర్వహణ చట్టం కింద.. చట్టబద్ధమైన అధికారాలను దేశవ్యాప్తంగా అనుసరించే విధంగా ఒక విధానాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని ప్రకారం.. ఏ రాష్ట్ర ప్రజలైనా దేశవ్యాప్తంగా ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించింది. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో కరోనాను నియంత్రించేందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఆస్పత్రుల్లో బాధితులకు మెరుగైన చికిత్స అందజేయాలని తెలిపింది. బెడ్స్ సౌకర్యం, ఆక్సిజన్ సిలిండర్ల ఏర్పాటు, మెడిసిన్స్ సౌకర్యాలను పెంచాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news