మ‌హా పాలిటిక్స్‌లో మ‌ళ్లీ ట్విస్ట్‌.. అజిత్ ప‌వార్ – ఫ‌డ్నీవీస్ చ‌ర్చ‌లు…!

-

ఎన్నికలు జరిగినప్పటి నుంచి మహారాష్ట్ర రాజకీయాలు ఏ రోజు ఎలా మారతాయో ఎవరు ఊహించటం లేదు. మహా పాలిటిక్స్‌లో ఎన్నో ట్విస్టులు… ఎంతో ఉత్కంఠ తర్వాత శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతకుముందు బిజెపికి చెందిన దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ ముఖ్యమంత్రిగా… ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రభుత్వం రెండు రోజులు కూడా ఉండకుండానే కుప్పకూలింది.

చివరకు శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్ కూటమి చేతులు కలపడంతో అధినేత ఉద్ద‌వ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. ఈ ప్ర‌భుత్వం ఏర్ప‌డి మంత్రి ప‌ద‌వుల‌పై చ‌ర్చ‌లు ఓ కొలిక్కి రాకుండానే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ భేటీ అవ్వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

వీరిద్ద‌రి చ‌ర్చ‌ల‌తో మ‌హారాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కూలుతుందా ? అనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, తర్వాత అజిత్‌ ఇచ్చిన వివరణతో పరిస్థితి సద్దుమణిగినా.. అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. స్వతంత్ర ఎమ్మెల్యే సంజయ్‌ షిండే కుమార్తె వివాహ కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఇద్దరూ చర్చించుకున్నారు.

అజిత్ ప‌వార్ వివ‌ర‌ణ ప్ర‌కారం కేవ‌లం పెళ్లి ఏర్పాట్ల‌లో ఏర్పాటు చేసిన కుర్చీల వ‌ల్లే తాము ప‌క్క ప‌క్క‌న కూర్చున్నామే త‌ప్పా.. త‌మ మ‌ధ్య ఎలాంటి రాజ‌కీయ ప‌ర‌మైన చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేద‌ని అంటున్నారు. అయితే రాజ‌కీయ వ‌ర్గాలు మాత్రం ఎన్సీపీలో అసంతృప్తితో ఉన్న అజిత్ ప‌వార్‌ను న‌మ్మ‌లేం అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news