జ‌న‌సేన‌ను ప‌ట్టించుకోని జాతీయ మీడియా.. ఒక్క సీటైనా గెలుస్తుందా..?

-

జ‌న‌సేన పార్టీకి 0 నుంచి 1 స్థానం వ‌స్తుంద‌ని అనేక ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పాయి కానీ.. అసలు ఆ ఒక్క స్థాన‌మైనా వ‌స్తుందా, ప‌వ‌న్ అయినా గెలుస్తాడా.. అన్న సందిగ్ధ‌త ప్ర‌స్తుతం నెల‌కొంది.

దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల తాలూకు ఫ‌లితాలు ఈ నెల 23వ తేదీన విడుద‌ల కానుండ‌గా, నిన్న తుది ద‌శ పోలింగ్ ముగియ‌డంతో జాతీయ మీడియా సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్‌ను ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలో అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ప‌ట్టం క‌ట్టాయి. ఇక ఏపీలో వైకాపా భారీగా అసెంబ్లీ స్థానాలు కైవ‌సం చేసుకుని అధికారంలోకి వ‌స్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్స్‌కు స‌ర్వే చేసిన జాతీయ మీడియా సంస్థలు అస‌లు జ‌న‌సేన‌ను ప‌ట్టించుకోలేదు. ఆ పార్టీకి అస‌లు సీట్లే రావ‌న్న‌ట్టుగా ఎగ్జిట్ పోల్స్‌ను జాతీయ మీడియా సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. దీంతో జ‌న‌సేన కార్య‌కర్త‌లు, ప‌వ‌న్ అభిమానుల్లో ఓ ర‌కమైన నైరాశ్యం నెల‌కొన్న‌ట్లు మ‌న‌కు స్ప‌ష్టంగా తెలుస్తుంది.

అయితే జ‌న‌సేన పార్టీకి 0 నుంచి 1 స్థానం వ‌స్తుంద‌ని అనేక ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పాయి కానీ.. అసలు ఆ ఒక్క స్థాన‌మైనా వ‌స్తుందా, ప‌వ‌న్ అయినా గెలుస్తాడా.. అన్న సందిగ్ధ‌త ప్ర‌స్తుతం నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ఎగ్జిట్ పోల్స్‌ను ప్ర‌క‌టించిన జాతీయ మీడియా సంస్థ‌లు అస‌లు జ‌న‌సేనను ప‌ట్టించుకోలేదు. ఎగ్జిట్ పోల్స్‌లో ఎక్క‌డా జ‌న‌సేన అనే మాట కూడా మ‌న‌కు వినిపించ‌లేదు. ఇక ప‌లు స‌ర్వే సంస్థ‌లు టీడీపీకి అధికారం వ‌స్తుంద‌ని చెప్పాయి కానీ జ‌న‌సేన ఊసే ఎత్త‌లేదు. అయితే ఆంధ్రా ఆక్టోపస్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మాత్రం జ‌న‌సేన‌కు ఒక అసెంబ్లీ స్థానం వ‌స్తుందని చెప్పారు.

జాతీయ మీడియా స‌ర్వే కంపెనీల్లో ఒక‌టైన ఇండియా టుడే జ‌న‌సేన‌కు 0 నుంచి 1అసెంబ్లీ స్థానం వ‌స్తుంద‌ని చెప్ప‌గా, ఐఎన్ఎస్ఎస్ 5, సీపీఎస్ 0 నుంచి 1, వీడీపీ అసోసియేట్స్ 0 నుంచి 4, న్యూస్18 సున్నా నుంచి 1, చాణ‌క్య 0, సీ ఓట‌ర్స్ 0, న్యూస్ ఎక్స్ 0, ఇండియా టీవీ 0, జ‌న్ కీ బాత్ 0 స్థానాలు వ‌స్తాయ‌ని చెప్పాయి. ఈ క్ర‌మంలో దాదాపుగా సర్వే సంస్థ‌ల‌న్నీ జ‌న‌సేన‌కు 0 స్థానాలు వ‌స్తాయ‌నే చెబుతున్నాయి. ఇక ఎగ్జిట్‌పోల్స్‌లో జ‌న‌సేన‌కు ద‌క్క‌బోయే లోక్‌స‌భ సీట్ల సంఖ్య కూడా 0 గానే ఉండడం గ‌మ‌నార్హం.

ఎన్నిక‌లకు ముందు, ఆ త‌రువాత కూడా జ‌నసేన అధినేత ప‌వ‌న్ తాము క‌చ్చితంగా 60 నుంచి 80 స్థానాలు సాధిస్తామ‌ని, ప్ర‌భుత్వ ఏర్పాటులో కీల‌క‌పాత్ర పోషిస్తామ‌ని అనేక సంద‌ర్భాల్లో చెబుతూ వ‌చ్చారు. కానీ ఎగ్జిట్ పోల్స్‌ను చూస్తే మాత్రం అందుకు భిన్నంగా వ‌చ్చాయి. ఇక న‌ర‌సాపురం నుంచి జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేసిన ప‌వ‌న్ అన్న నాగ‌బాబు తాను మ‌హిళ‌ల ఓట్ల‌తో గెల‌వ‌నున్నార‌ని గ‌తంలో చెప్పారు. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం జ‌నసేన‌కు 0 ఎంపీ స్థానాలు వ‌స్తాయ‌ని తేల్చేశాయి. ఈ క్ర‌మంలో జ‌న‌సేన పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కొంత ఆందోళ‌న‌లో ఉన్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడు వ‌చ్చిన‌వి ఎగ్జిట్ పోల్సే క‌నుక‌.. అవే ఫ‌లితాలు క‌చ్చితంగా రిపీట్ అవుతాయ‌ని చెప్ప‌లేం. అందుక‌ని అస‌లు ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యే వ‌ర‌కు ఆగాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news