తెలంగాణ బీజేపీలో కొత్త బాస్ ఎవ‌రు..! అతనే సీఎం అభ్యర్థి

-

తెలంగాణలో ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవికి మంచి డిమాండ్ వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లోఆ పార్టీ నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడం, అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ధీటుగా ఎదుగుతుండటంతో చాలామంది నేతలు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. పైగా అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తే సీఎం అభ్యర్ధి అవుతారనే ప్రచారం ఉండటంతో మరింత డిమాండ్ పెరిగిపోయింది. అందుకే అధ్యక్ష పదవి రేసులో చాలామంది ఉన్నారని తెలుస్తోంది. కానీ రేసులో ఎంతమంది ఉన్న ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కే మళ్ళీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది.

అందుకు తగ్గట్టుగా ఆయన అధిష్టానం వద్ద ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు లోక్ సభ ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి లక్ష్మణ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల తీవ్రత పెంచారు. అలాగే ఇతర పార్టీ నేతలనీ బీజేపీలో చేర్చడంలో లక్ష్మణ్ కాస్తా ఎక్కువ చొరవే చూపిస్తున్నారు. పైగా అధిష్టానం వద్ద లక్ష్మణ్ కి మంచి పేరే ఉంది. దీంతో ఆయనకే మరోసారి పదవి దక్క వచ్చని ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడుప్పుడే టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ఎదుగుతున్న సమయంలో బీజేపీని ఇంకా పైకి లేపే నేత కోసం అధిష్టానం చూస్తున్నట్లు తెలుస్తోంది.

అలా అని లక్ష్మణ్ సత్తా మీద నమ్మకం లేకుండా ఏమి లేదు. కాకపోతే లక్ష్మణ్ లో మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. 2014లో టీడీపీతో పొత్తులో భాగంగా లక్ష్మణ్ ముషీరాబాద్ నుంచి బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. దీంతో డిపాజిట్లు దక్కించుకోలేని నేతని అధ్యక్షుడుని చేస్తే ప్రజల్లో నెగిటివ్ సంకేతాలు వెళ్తాయి. అపోజిషన్ పార్టీలు విమర్శలు చేయడానికి అవకాశం కల్పించినట్లు అవుతుంది.

ఈ పరిస్థితులన్నీ అంచనా వేసుకుని బీజేపీ అధిష్టానం అధ్యక్ష పదవికి అర్హుడైన నేత కోసం వేట మొదలుపెట్టింది. అయితే ఈ రేసులో లక్ష్మణ్ తో పాటు…. జితేంద‌ర్ రెడ్డి, డీకే అరుణ‌, రామ‌చంద్రారెడ్డి, ప్ర‌భాక‌ర్, రామ‌చంద్ర‌రావులు ఉన్నారు. అధ్యక్షుడైతే సీఎం అభ్యర్ధి కూడా వాళ్లే అవుతారనే ప్రచారం ఉండటంతో వీరు అధ్యక్ష పదవి కోసం అధిష్టానం వద్ద గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అధిష్టానం అధ్యక్ష పీఠం ఎవరికి అప్పగిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news