జూన్ 14 నుంచి వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు ఉంటాయా?

-

రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం… ఓ నూతన అధ్యాయం నిర్మాణం కోసం… ప్రజా సమస్యలపై బలమైన పోరాటం చేసేందుకు వారాహి యాత్రను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన వారాహి యాత్ర ప్రారంభించబోతున్నారు. సకల శుభాలనిచ్చే అన్నవరం సత్యదేవుడి దర్శనంతో యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర ఉంటుంది. కేవలం ఎన్నికల కోసం మాత్రమే యాత్ర కాదు. ప్రజల బాధలను దగ్గరగా తెలుసుకునేందుకు, వారితో మమేకం అయ్యేందుకు ఇదో చరిత్రలో నిలిచిపోయే యాత్ర కాబోతోందని జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు.

ప్రతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు ఉండేలా ప్రణాళిక తయారు చేసుకున్నారు. 11 నియోజకవర్గాల్లో మొదటిగా యాత్ర జరగబోతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంతో మొదలుపెట్టి, పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు తర్వాత నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో యాత్ర రూట్ మ్యాప్ ను స్థానిక పార్టీ నేతలు చర్చించి ఖరారు చేస్తారు. ప్రతి నియోజక వర్గంలో వారాహి నుంచి ప్రజలని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.

వినతులు స్వీకరిస్తూ… క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ…

ప్రజల సమస్యలు వింటూ, వాటిని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, సమస్యలతో సతమతమవుతున్న బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ యాత్ర సాగేలా ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు ప్రజా వినతులు స్వీకరించి, స్థానికులు, రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలతో పవన్ ప్రత్యేకంగా మాట్లాడుతారు. అనంతరం పార్టీ నాయకులు, వీర మహిళలతో పార్టీ బలోపేతం మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశం ఉంటుంది.ప్రజల్లో చైతన్యం తెచ్చేలా, పాలకుల కళ్లు తెరిపించేలా, సమస్యకు పరిష్కారం చూపేలా గళమెత్తుతారు.

పొత్తులలో భాగంగా ఖరారు అయిన యాత్ర కాదిది.అన్నీ నియోజకవర్గాల్లోనూ వారాహి యాత్ర ఉండాలనేది కళ్యాణ్ అభిమతం.అందుకే ప్రతి నియోజక వర్గంలో జన వాణి కార్యక్రమం ఉంటుందని ఇప్పటికే ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news