Puri Jagannadh : పూరీ జగన్నాథ్ ఫుల్ హ్యాపీ.. ఇన్నాళ్లకు కలల సాకారంలో డైరెక్టర్

-

ఆయనో అగ్రశ్రేణి దర్శకుడు.. ఆయన దర్శకత్వంలో స్టార్ హీరోలు ఒకటి కాదు రెండు కాదు కొందరు హీరోలు అయితే ఏకంగా నాలుగు ఐదు సినిమాలు చేశారు. ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలు చేసిన ఆయన.. తన కలలను మాత్రం ఇన్నాళ్ల పాటు సాకారం చేసుకోలేకపోయారు. తన మనసులో ఉన్న కోరికలు, తను అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయారు. ఆయన ఎవరో కాదండోయ్.. టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.

తెలుగు చిత్రసీమలో చాలా ఫాస్ట్ గా సినిమాలు తీసే దర్శకుడిగా పేరొందిన పూరీ.. తన డైలాగ్స్ ద్వారానే ప్రేక్షకులను అలా అర నిమిషంలో భావోద్వేగాలకు గురయ్యేలా చేస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘బద్రి’ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన పూరీ జగన్నాథ్..నిజానికి వెండితెరకు నటుడిగా పరిచయం కావాలనుకున్నారు.

సిల్వర్ స్క్రీన్ పైన యాక్టర్ గా చెలరేగిపోవాలనుకున్నాడు. కానీ, అది అనుకున్న స్థాయిలో కుదరలేదు. ఒకటి అర వేషాలతోనే తనలోని నటుడికి ఫులిస్టాప్ చెప్పిన పూరీ.. తర్వాత కాలంలో స్టార్ డైరెక్టర్ అయిపోయారు. అలా నర్సీపట్నం నుంచి వచ్చిన పూరీ జగన్నాథ్ తన మనసులో ఉన్న నటుడి కలను అలాగే వదిలేశాడు.

2022 వ సంవత్సరం అనగా ఈ ఏడాది ఒకరకంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ కు బాగా కలిసొస్తున్నదని చెప్పొచ్చు. చాలా కాలం నుంచి తను వెండితెర మీదకు తీసుకు రావాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్టు ‘జనగణమన’ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఈ ఫిల్మ్ చేస్తున్నారు పూరీ. ఈ క్రమంలోనే వెండితెరపైన నటుడిగా కనబడాలనుకున్న తన కలను కూడా సాకారం చేసుకోబోతున్నారు. అది కూడా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రంతో అవుతుండటం విశేషం.

పూరీ జగన్నాథ్ మొదటి కలను కలగా మిగిలిపోనివ్వకుంగా సాకారం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకు రావడం అభినందనీయమని చెప్పొచ్చు. గతంలో పూరీ జగన్నాథ్ – చిరంజీవి కాంబినేషన్ సినిమా గురించి బోలెడంత చర్చ జరిగింది. అది మెటీరియలైజ్ కాలేదు. కానీ, వీరు సిల్వర్ స్క్రీన్ పైన స్క్రీన్ షేర్ చేసుకోవడం మాత్రం కన్ఫర్మ్ అయింది. దాంతో ఇది అయినా జరిగిందని సినీ అభిమానులు ఆనందపడుతున్నారు.

మాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’ రీమేక్ గా వస్తున్న ‘గాడ్ ఫాదర్’ పిక్చర్ లో పూరీ జగన్నాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తుండగా, మోహన్ రాజా డైరెక్టర్. ఈ చిత్రంతో తన నటుడి కలను, ‘జనగణమన’ చిత్రంతో తన డ్రీమ్ ప్రాజెక్టు కలను .. ఇలా ఈ ఏడాదిలో తన కలలను సాకారం చేసుకుంటున్నారు దర్శకులు పూరీ జగన్నాథ్.

Read more RELATED
Recommended to you

Latest news