పువ్వాడ vs పొంగులేటి..సెంట్రల్ బ్యాంక్ కేంద్రంగా ముదిరిన టీఆర్ఎస్ వర్గపోరు

-

సెంట్రల్ బ్యాంక్ కేంద్రంగా కాక పుట్టిస్తుంది ఖమ్మం టీఆర్ఎస్ వర్గపోరు. పది కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయంటూ గత పాలకవర్గం పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చెశారు. అధికార పార్టీలోని వర్గపోరుతోనే మాజీ ఎంపీ పొంగులేటి అనుచరుడిగా ఉన్న మాజీ డీసీసీబీ చైర్మన్ సహా డైరక్టర్ల పై కేసులు నమోదయ్యాయని..మంత్రి పువ్వాడ తెరవెనుకుండి ఈ వ్యవహారం నడిపిస్తున్నారని చర్చ మొదలైంది. ఖమ్మం జిల్లా రాజకీయాలు ఇప్పుడు దీని చుట్టూనే తిరుగుతున్నాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ మువ్వా విజయబాబు, ఆయన పాలకవర్గంలోని 21 మంది డైరెక్టర్లపై కేసు నమోదు ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. ఈ కేసు నమోదు వెనక ఎవరు ఉన్నారు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తుంది. కేవలం గత పాలకవర్గంతో వదిలిపెట్టకుండా ముగ్గురు పాత సీఈవోలపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ విభేదాలతోనే మాజీ ఎంపీ పొంగులేటి అనుచరుల పై కేసులు పెట్టారన్న చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తుంది.

విజయబాబు బ్యాంకు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రైతుల కోసం ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఇది జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు అనుబంధంగా ఉండే ఆస్పత్రి. దేశంలో ఎక్కడా సహకార బ్యాంకుల ఆధ్వర్యంలో ఆస్పత్రులు లేవు. దాంతో బ్యాంకు నిధులను మళ్లించడానికే ఆస్పత్రిని తెరపైకి తీసుకొచ్చారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అదే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారినట్టు చెబుతున్నారు. పదవీ కాలం ముగిసిన తర్వాత విజయ్‌బాబు ట్రస్ట్‌లోని ప్రైవేట్‌ వ్యక్తులకు ఆస్పత్రిని అప్పగించడం కూడా మరో వివాదానికి కేంద్రబిందువైంది.

ఆస్పత్రి నిర్మాణానికి రైతు సంక్షేమ నిధి పేరుతో 6 కోట్ల 13 లక్షలు, ఉద్యోగులకు బహుమతులు, డైరెక్టర్లకు వెండి ప్రతిమలకు మరో 63 లక్షలు కేటాయించారట. విజ్ఞాన పర్యటన కోసం మరో 55 లక్షలు ఖర్చు చేశారట. వీటన్నింటిలోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో కేసు పెట్టి తదుపరి చర్యలపై ఫోకస్‌ పెట్టారు. ప్రస్థుతం విజయ్ బాబు మాజీఎంపీ పొంగులేటి వర్గంలో కీలక నేతగా ఉన్నారు. దీంతో ఇప్పుడు కేసు పెట్టడం వెనక మంత్రి పాత్ర ఉన్నట్టు మువ్వా వర్గం అనుమానిస్తోందట.

మొత్తానికి జిల్లా టీఆర్‌ఎస్‌లో ఉన్న వర్గపోరు అటు తిరిగి ఇటు తిరిగి డీసీసీబీ బ్యాంకుపై కేసు రూపంలో బయటపడింది. కాకపోతే ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఎవరూ విమర్శించకుండా తన అనుచరుడైన బ్యాంక్‌ వైస్‌ఛైర్మన్‌ పై కూడా మంత్రి వర్గీయులు కేసులో పెట్టారని చర్చ జరుగుతోంది. త్వరలో ఖమ్మంలో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అన్న చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news