మనది రాజకీయ అనుబంధం కాదు.. కుటుంబ అనుబంధం : రాహుల్

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే నేడు కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజాభేరి సభలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రజా తెలంగాణ.. దొరల తెలంగాణకు మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలపై విమర్శలు చేశారు.

ఈ సభలో పీసీసీ చీఫ్​రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.ఢిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉన్నా.. ప్రియాంక అనారోగ్యం దృష్ట్యా తాను కొల్లాపూర్ సభకు వచ్చానని చెప్పారు రాహుల్. మనది రాజకీయ అనుబంధం కాదు.. కుటుంబ అనుబంధం అని అన్నారు. కొల్లాపూర్‌ సభకు తప్పక వస్తానని ప్రియాంక హామీ ఇచ్చారని. ఆమె రాలేని పరిస్థితుల్లోనే తాను ఇక్కడి బహిరంగ సభకు వచ్చానన్నారు. టికెట్ల విషయంలో ఢిల్లీలో సీఈసీ భేటీ ఉన్నా సభకు హాజరయ్యానని చెప్పారు. ఓవైపు సీఎం కుటుంబం.. మరోవైపు తెలంగాణ సమాజం.. నిరుద్యోగులు, మహిళలు ఉన్నారని, దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీ చేశాయన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుబంధు నిలిచిపోతుందని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అందులో వాస్తవం లేదన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కౌలు రైతులతో సహా అందరికీ రైతు భరోసా కింద రూ.15వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ కూలీలకు కూడా రూ.12 వేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఏడాది కాకుండానే బ్యారేజీలు కూలిపోతున్నాయని రాహుల్​ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో చారిత్రాత్మక సంస్థలను, ప్రాజెక్టులను నెలకొల్పిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version