సోమేష్ కుమార్ రాజీనామా చేయాలి – బండి సంజయ్

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ఈరోజు హైదరాబాద్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ సూచిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోర్టు తీర్పును శిరసావహిస్తూ సోమేశ్ కుమార్ ను సీఎస్ బాధ్యతల నుండి తప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేయాల్సిందిగా బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు.

2014 రాష్ట్ర విభజన తరువాత డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికం, అప్రజాస్వామికం అన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడూ చట్టాలను, రాజ్యాంగాన్ని, కేంద్ర నిబంధనలను గౌరవించలేదని.. తన రాజకీయ అవసరాల కోసం తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అధికారులను పావుగా వాడుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు కేటాయించబడ్డ ఎందరో అధికారులు సీనియారిటీ లిస్టులో ఉండగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడ్డ సోమేశ్ కుమార్ ను చీఫ్ సెక్రటరీగా నియమించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ లబ్ది పొందారని అన్నారు.

317 జీవో సహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను సోమేశ్ కుమార్ ద్వారా విడుదల చేయించారని అన్నారు. అదే విధంగా హెచ్ఎండీఏ, రెవిన్యూ, ఇరిగేషన్, హోం తదితర శాఖల్లో తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేందుకు సోమేశ్ కుమార్ ను పావుగా వాడుకున్నారని అన్నారు. సోమేశ్ కుమార్ నియామకం విషయంలో కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండగా చీఫ్ సెక్రటరీగా నియమించడం కేసీఆర్ అనైతిక రాజకీయాలకు నిదర్శనం అని మండిపడ్డారు.

ఈ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒక న్యాయం? సోమేశ్ కుమార్ కు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాల ప్రకారం సోమేశ్ కుమార్ తొలగించి తెలంగాణ వ్యక్తిని లేదా తెలంగాణ కేటాయించి వ్యక్తిని సీఎస్ గా నియమించాలని డిమాండ్ చెశారు. డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీకి కేటాయించబడ్డ అధికారులను ఆ రాష్ట్రానికి బదలాయించాలని.. అట్లాగే తెలంగాణకు కేటాయించిన అధికారులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని బీజేపీ డిమాండ్ చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news