నా సక్సెస్​ మంత్ర కష్టపడటమే : గోల్డెన్ లేడీ నిఖత్ జరీన్

-

కష్టపడి సాధన చేస్తున్నంత కాలం తనను ఎవరూ ఆపలేరని భారత బాక్సింగ్‌ స్టార్‌, తెలుగమ్మాయి నిఖత్‌ జరీన్‌ స్పష్టంచేసింది. దేశానికి పతకాలు అందిస్తుండటమే తన లక్ష్యమని తెలిపింది. ఆదివారం కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకంతో సత్తాచాటిన నిఖత్‌.. తన ఆనందాన్ని పంచుకుంది.

“మూడు నెలల వ్యవధిలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఆకాశంలో తేలుతున్నట్లు అనిపిస్తోంది. ఒకప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నది నా కల. అలాంటిది అత్యున్నత వేదికల్లో పతకాలు గెలుస్తుండటం చెప్పలేనంత సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. కష్టపడుతున్నందుకు ఫలితాలు వస్తున్నాయి. కష్టపడి సాధన చేస్తున్నంత కాలం నన్నెవరూ ఆపలేరు. భవిష్యత్తులోనూ దేశానికి పతకాలు అందిస్తూనే ఉంటా. మరింత బరువు తగ్గించుకుని విభాగాన్ని మార్చుకుంటా.” అని నిఖత్ చెప్పింది.

”కామన్వెల్త్‌ క్రీడల్లో నేను ఆడిన మ్యాచ్‌లన్నీ ఏకపక్షంగా ముగియడం ఆనందంగా ఉంది. బాక్సింగ్‌ బౌట్‌లో ఎప్పుడైనా పాయింట్ల అంతరం ఎక్కువగా ఉండదు. కాస్త తేడా వచ్చినా ఫలితం తారుమారుకావొచ్చు. అందుకే రింగ్‌లో అడుగుపెట్టినప్పుడు నూటికి నూరు శాతం ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఏకగ్రీవంగా గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంటా.  ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో పోల్చుకుంటే ఇక్కడ పోటీ తక్కువగా ఉంది. అయితే ప్రత్యర్థులెవరినీ తేలిగ్గా తీసుకోలేదు. ప్రతి బౌట్‌ను ఫైనల్‌ మాదిరే ఆడా. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను.”   – నిఖత్ జరీన్, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్

‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం తర్వాత నాపై అంచనాలు.. ఒత్తిడి పెరిగాయి. ఒత్తిడి ఉండాలనే కోరుకుంటా. ప్రపంచ ఛాంపియన్‌గా మంచి ప్రదర్శన ఇవ్వాలని మొదట నాకు నేనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటా. అంచనాలకు తక్కువగా రాణిస్తే ముందు నిరాశ ఎదురయ్యేది నాకే. సులువైన ప్రత్యర్థి ఉన్నా కూడా తేలిగ్గా తీసుకోను.’ అని నిఖత్ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news