వాలంటీర్లకు కౌంటర్‌గా సొంత టీమ్ టీడీపీ వ్యూహం ఫలిస్తుందా ?

-

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తర్వాత టీడీపీకి ఒక విషయంలో టెన్షన్‌ పట్టుకుంది. ప్రభుత్వం చేతిలో ఉన్న వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికలను తీవ్రంగా ప్రభావం చూపుతున్నట్టు టీడీపీ నమ్ముతోంది. దీంతో తిరుప‌తి లోక్‌సభ ఉపఎన్నికలో టీడీపీ సరికొత్త ప్రయోగం చేయబోతుంది. ప్రభుత్వ వాలంటీర్లకు కౌంటర్‌గా సొంత టీమ్‌ను సిద్ధం చేస్తోంది. అధికారపక్షం ముందు టీడీపీ ప్లాన్‌ ఏ మేరకు వర్కవుట్‌ అవుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఏపీలో తిరుపతి ఉపఎన్నిక సందడి మొదలైంది. నామినేషన్ల ఘట్టం కొనసాగుతోంది. గెలుపుపై పార్టీల వ్యూహాలు పదునెక్కుతున్నాయి. అయితే ముఖ్యంగా విశాఖ మున్సిపల్‌ ఎన్నికల్లో మధ్యాహ్నం వ‌ర‌కు త‌మ‌కు అనుకూలంగా పోలింగ్ జ‌రిగిందని.. వాలంటీర్ల ప్రవేశంతో పరిస్థితి మారిపోయిందని గ్రహించారట. ఓటింగ్‌కు దూరంగా ఉన్న వారిని వెతికి మ‌రీ వాలంటీర్లు పోలింగ్‌ బూత్‌ దగ్గరకు తీసుకురావడం ద్వారా అధికార పార్టీకి లబ్ధి జరిగిందని టీడీపీలో చర్చ జరుగుతోంది. అందుకే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వాలంటీర్ల ప్రభావంపై ఒక అంచనాకు వచ్చారట టీడీపీ నేతలు. కౌంటర్‌ ప్లాన్‌ సిద్ధం చేసినట్టు సమాచారం.

రాష్ట్రంలో ప్రతి 50 కుటుంబాలు కవర్‌ అయ్యేలా వాలంటీర్ల వ్యవస్థ ఉంది. ప్రభుత్వ పథకాల నుంచి అన్ని వ్యవహారాలు వారే చక్కబెడుతున్నారు. గ్రామస్థాయిలో మంచి పట్టు సాధించారు. పథకాల లబ్ధిదారులు, ఇతర వర్గాలు అధికార పార్టీకి ఓటేసేలా ఈ వ్యవస్థ గట్టిగా పనిచేస్తున్నట్టు టీడీపీ నమ్ముతోంది. వైజాగ్‌లో జరిగింది.. తిరుపతిలో రిపీట్‌ కాకూడదని భావిస్తోన్న తెలుగుదేశం.. లోక్‌సభ పరిధిలో ప్రతి 50 కుటుంబాలకు ఒక పార్టీ కార్యకర్తకు బాధ్యత అప్పగించబోతున్నట్టు సమాచారం. వాలంటీర్లపై ఎన్నికల వేళ కన్నేయడంతోపాటు.. తమ పరిధిలో ఉన్న కుటుంబాలను ఓటింగ్‌కు వచ్చేలా చేయడం కార్యకర్తల బాధ్యతగా చెబుతున్నారు.

లోక్‌సభ పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో గట్టి కార్యకర్తల బలం ఉందని టీడీపీ వర్గాల మాట. ఆయా ప్రాంతాల వారికి బాధ్యతలు అప్పగించడం ద్వారా అధికార పార్టీకి విరుగుడు మంత్రం వేయొచ్చని లెక్కలు వేసుకుంటున్నారు టీడీపీ నాయకులు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి పార్టీ నేతలు తీసుకెళ్లారట. ఓటు వేయకపోతే పథకం పోతుంది అనే భయాన్ని తొలగించేలా కూడా పార్టీ కేడర్‌ ప్రచారం చేస్తుందట. ఈ కొత్త ఆలోచనకు టీడీపీ చీఫ్‌ ఓకే అంటారో లేదో కానీ.. క్షేత్రస్థాయిలో ఎంత వరకు పార్టీకి మేలు చేస్తుందన్న చర్చ మొదలైంది. అలాగే అధికారపార్టీని కౌంటర్‌ చేయడానికి 50 కుటుంబాలకు ఒక టీడీపీ కార్యకర్త అస్త్రం ఇచ్చే ఫలితాలపై కొందరు లెక్కలు వేయడం కూడా మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news