తెలంగాణలో కొత్త పార్టీ..కేసీఆర్ వ్యాఖ్యల పై ఆసక్తికర చర్చ

-

రాజకీయ పార్టీని పెట్టడం, నడపడం అంటే తమాషా కాదు. పాన్‌ డబ్బా పెట్టినంత ఈజీ కాదు. తెలంగాణలో ఇప్పటి వరకు 20 పార్టీలు వచ్చాయి.. వాటి పరిస్థితి ఏంటో తెలుసు కదా.. ఈ మాటలు అన్నీ కేసీఆర్ నోటి నుంచి వచ్చాయి. కేసీఆర్‌ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు ? ఎందుకిలా అన్నారు అన్నదే తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రస్థానం, క్రమశిక్షణపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఈ సందర్భంగా పార్టీ నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. పార్టీ పెట్టడం, నడపడం అంటే అంత ఈజీ కాదన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీని పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 20 పార్టీలు కొత్తగా వచ్చాయి. తెలంగాణ సాధనసమితి అని, ప్రజారాజ్యమని, జైసమైక్యాంధ్రపార్టీ, ప్రజాపార్టీతో పాటు మరికొన్ని పార్టీలు వచ్చాయి. కానీ ఆ పార్టీలు ఏమయ్యాయో..అందరికీ తెలుసున్నారు కేసీఆర్.

పార్టీ సమావేశంలో కేసీఆర్ పార్టీ ఏర్పాటు… నిర్వహణపై ఎందుకు మాట్లాడారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఏమైనా కొత్తగా పార్టీ వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతోనే కేసీఆర్ అలా మాట్లాడారా.. అన్న గుసగుసలు మొదలు అయ్యాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కొత్త పార్టీ ఏర్పాటు… నిర్వహణ సవాళ్లతో కూడుకుందని కేసీఆర్ చెప్పకనే చెప్పారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుపై అధికారికంగా ఎటువంటి చర్చలు లేవు. అయితే సోషల్ మీడియాలో మాత్రం కొత్త పార్టీలపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.

మంత్రి ఈటల రాజేందర్‌ అధికార టీఆర్‌ఎస్‌ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నారా ?అందుకే సీఎం కేసీఆర్‌ ఆదివారం నాటి సమావేశంలో కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీ కాదనే వ్యాఖ్యలు చేశారా అనే చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. గతంలో మేం టీఆర్‌ఎస్‌ జెండా ఓనర్లం.. కిరాయిదారులం కాదు అని వ్యాఖ్యానించిన ఈటల.. ఈ మధ్య రైతుల ఆందోళన, ధాన్యం కొనుగోలు అంశాలపై ప్రభుత్వాన్ని కొంత ఇరుకునపెట్టే విధంగా మాట్లాడారనే అభిప్రాయం పార్టీ ముఖ్యుల్లో వ్యక్తమైంది. ఇందుకు సంబంధించి కచ్చితమైన సమాచారం ఉండడంతోనే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది.

తెలంగాణలో కొత్తపార్టీ వస్తే.. అది ఎవరికి లాభం..ఎవరికి నష్టం అన్న చర్చ జరుగుతూ వస్తోంది. మొత్తంగా కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడటంతో.. ఇప్పడు అందరూ ఆ అంశంపై ఆసక్తి చూపుతున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీ 20 ఏళ్ళ ప్రస్థానం గురించి మాట్లాడుతున్న సందర్భంగానే.. కేసీఆర్ కొత్త పార్టీల గురించి మాట్లాడారు తప్ప.. దానికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని టిఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news