తెలంగాణ గ్రూప్-1 ఫలితాలను వెల్లడించేందుకు తెలంగాణ పబ్లిక్ కమీషన్ వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన కూడా ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగించి.. అనంతరం మరో రెండు వారాల్లో తుది ఫలితాలను వెల్లడించనుంది. ఈ మేరకు మార్చి మొదటి వారంలో జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించనుంది.
సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనంతరం తుది జాబితా వెల్లడిస్తుంది. ఆ తరువాత వెనువెంటనే గ్రూప్ 2, 3 ఫలితాలను కూడా వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది. తద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్లాగ్లు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. గతేడాది ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించగా.. అదే ఏడాది గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు 7 పేపర్లకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. నిజానికి ప్రిలిమ్స్లో 31,383 మంది క్వాలిఫై అవగా.. వారిలో కేవలం 67.17 శాతం మాత్రమే పరీక్ష రాశారు. దీని ప్రకారం.. ఒక్కో పోస్టుకు 38 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.