ఈనెల 27న టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం

-

ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెడతామని ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం 16 బస్సులను కూడా కొనుగోలు చేసింది. అయితే ఈనెల 27 నుంచి ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై, కర్ణాటకలోని బెంగళూరు, హుబ్బళ్లి నగరాలకు ఈ బస్సులను నడిపేలా  ప్రణాళికలు రూపొందించారు.

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, విజయవాడ, గుంటూరు వంటి నగరాలకు ‘వెన్నెల’ పేరుతో ఏసీ స్లీపర్‌ బస్సులు నడిచాయి. రాష్ట్ర ఆవిర్భావం.. ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి విడిపోయి టీఎస్‌ఆర్టీసీ ఏర్పడినప్పటి నుంచి ఏసీ స్లీపర్‌ బస్సులు లేవు. ఈ అవకాశాన్ని టీఎస్‌ఆర్టీసీ ఆలస్యంగా అందిపుచ్చుకుంది. ‘లహరి’ పేరుతో కొంతకాలం క్రితం నాన్‌ ఏసీలో 12 స్లీపర్‌, హైబ్రిడ్‌ (కొన్ని బెర్తులు, కొన్ని సీట్లు) ప్రవేశపెట్టింది. ఏసీ స్లీపర్‌ బస్సులను మాత్రం అశోక్‌ లైలాండ్‌ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఒక్కో బస్సుకు రూ.55 లక్షలు వెచ్చిస్తోంది. ఇప్పటికే 4 బస్సులు రాగా శనివారం మరో నాలుగు మిగిలినవి నెలాఖరుకు రానున్నట్లు ఆర్టీసీ వర్గాల సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news