ఈ స్టార్ వారసురాళ్లు మస్తు స్పీడు​.. కోట్ల రూపయల్ని చక్కబెట్టేస్తున్నారుగా!

-

ఓ హీరో తనయుడు కథనాయకుడు అవ్వొచ్చు. ఓ దర్శకుడి అబ్బాయి డైరెక్టర్​గా మారొచ్చు. కానీ నిర్మాతల సంతానం మాత్రం నిర్మాతలవడం కాస్త అరుదనే చెప్పాలి. అందులోనూ అమ్మాయిలు ఆ బాధ్యతలను భుజాన వేసుకోవడం వంటి సందర్భాలను మనం చూడటం దాదాపు కష్టమే. కానీ గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీ ప్రయాణం చూస్తే.. ఈ ట్రెండ్‌ మారుతున్నట్లు కనిపిస్తోంది.

కొందరు నిర్మాతలు, దర్శకులు, హీరోల వారసురాళ్లు.. నిర్మాతగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. కోట్ల రూపాయల వ్యవహారాల్నీ చకచకా చూసుకుంటున్నారు. చిత్రసీమలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ సారి వారి ప్రయాణాన్ని చూద్దాం..

స్టార్​ వారసురాళ్లలో నిర్మాతగా రాణిస్తున్న వారిలో మెగాస్టార్​ చిరంజీవి తనయురాలు సుష్మిత కొణిదెల ఒకరు. చదువు పూర్తయ్యాక ‘నిఫ్ట్‌’లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశారు. రంగస్థలం, ఖైదీ నెంబర్‌ 150, సైరా సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేశారు. ‘షూటవుట్‌ ఎట్‌ ఆలేర్‌’ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ నిర్మించి ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగారు. సంతోష్‌ శోభన్, గౌరి జి.కిషన్‌ నాయకానాయికలుగా భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి ‘గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ పతాకంపై ‘శ్రీదేవి శోభన్‌బాబు’ పేరుతో ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ పట్టాలకెక్కిస్తున్నారు. కమ్రాన్‌ సంగీత దర్శకుడు. నాగబాబు, రోహిణి కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్లో టీజర్‌ విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్‌కుమార్‌ దిమ్మల.

‘ముద్దపప్పు ఆవకాయ్‌’, ‘నాన్నకూచి’, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్‌సిరీస్, ఓటీటీ సినిమాలు నిర్మించి తన అదృష్టం పరీక్షించుకుంది నాగబాబు అమ్మాయి నిహారిక కొణిదెల . త్వరలోనే తను ఓ ఫీచర్‌ ఫిల్మ్‌ నిర్మించనున్నట్టు సమాచారం. కథా చర్చలు జరుగుతున్నాయి.

Image
నిహారిక కొణిదెల

మెగా ప్రొడ్యూసర్‌ అశ్వినీదత్‌ వారసురాళ్లు స్వప్నాదత్ , ప్రియాంకా దత్‌లు. నాన్న నిర్మిస్తున్న చిత్రాలకు సహకారం అందిస్తూనే ‘త్రీ ఏంజెల్స్‌’, ‘స్వప్న సినిమా’ పతాకాలపై సొంతంగా చిత్రాలు తీస్తున్నారు. ఇటీవలే వీరు నిర్మించిన సీతారామం సూపర్​ సక్సెస్​ను అందుకుంది. త్వరలోనే ‘ప్రాజెక్ట్‌ కె’ రానుంది.

Image
స్వప్నాదత్ , ప్రియాంకా దత్‌

దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు దివ్యదీప్తి. మొదట్లో ఆయన దగ్గరే కొన్ని సినిమాలకు సహాయ దర్శకురాలిగా పని చేశారు. నాన్న అండతో మెగా ఫోన్‌ పట్టుకోవాలనీ భావించారు. ఇంతలో ఆయన హఠాన్మరణంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. తర్వాత అమ్మ సలహాతో నిర్మాతగా మారారు. తొలి ప్రయత్నంగా కిరణ్‌ అబ్బవరం, సంజనా ఆనంద్‌ జంటగా ‘కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్‌లో ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ నిర్మిస్తున్నారు. శ్రీధర్‌ గాదె తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తైంది. మణిశర్మ సంగీత దర్శకుడు.

‘చూడాలని ఉంది’, ‘ఒక్కడు’ లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు అందించిన దర్శకుడు గుణశేఖర్‌. ఆయన పెద్దమ్మాయి నీలిమ. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్‌మినిస్టర్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. లండన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌లో.. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసి కొన్నాళ్లు డిజైనర్‌గానూ పని చేశారు. తర్వాత ఇండియా తిరిగొచ్చి నాన్నకి సాయంగా ఉంటున్నారు. ‘రుద్రమదేవి’ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ అనుభవంతో పూర్తిస్థాయి నిర్మాతగా మారారు. అగ్ర కథానాయిక సమంత ముఖ్యపాత్రలో ‘శాకుంతలం’ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబరులో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనికి దర్శకుడు గుణశేఖరే. దేవ్‌మోహన్, మోహన్‌బాబు, ప్రకాష్‌రాజ్, కబీర్‌ బేడీ, గౌతమిలాంటి భారీ తారాగణంతో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోందీ సినిమా.

సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగరసంగమం, స్వయంకృషి లాంటి ఉత్తమాభిరుచి గల సినిమాలు నిర్మించిన సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌. దీని సృష్టికర్త ఏడిద నాగేశ్వరరావు. ఆయన మనవరాలు, ఏడిద శ్రీరామ్‌ కూతురే శ్రీజ. తాత తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ‘ఫస్ట్‌ డే.. ఫస్ట్‌ షో’కి నిర్మాతగా మారారు. దీనికోసం శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనే సొంత సంస్థ ప్రారంభించారు. రొమాంటిక్‌ కామెడీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌ కథ అందించారు. షూటింగ్‌ పూర్తైంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. వంశీధర్‌గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంచెట్టి తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్, సంచిత బసు హీరోహీరోయిన్లు. రథన్‌ స్వరాలందించారు.

నిర్మాత సుధాకర్‌రెడ్డి కూతురు, నితిన్‌ సోదరి నిఖితారెడ్డి.. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై గతంలోనే చిత్రాలు నిర్మించారు. ఇటీవలే ఆమె నుంచి విడుదలైన యాక్షన్‌ రొమాంటిక్‌ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. నితిన్, కృతి శెట్టి, కేథరిన్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి దర్శకుడు.

అగ్ర నిర్మాత దిల్‌ రాజు కూతురు హన్షితారెడ్డి. నాన్న నిర్మిస్తున్న సినిమాల ప్రొడక్షన్‌ వ్యవహాలు ఎప్పట్నుంచో చూసుకుంటున్నారు. ఆయన హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌లో సొంత స్టూడియో నిర్మించనున్నట్టు సమాచారం. స్టూడియో నిర్మాణం పూర్తైన వెంటనే అన్ని బాధ్యతలు తనే తీసుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news