“ప్రజారాజ్యం – జనసేన” వేరు వేరంటున్న వీర్రాజు.. కొత్త లెక్కలు చూశారా?

-

రాజకీయాల్లో లెక్కలు చాలా ముఖ్యం! ఎక్కడికక్కడ సామాజికవర్గాల లెక్కలు, మత ప్రాతిపదికన గణాంకాలు, ఉద్యోగులు ఎవరు – రైతులు ఎవరు… ఇలా ప్రతీదీ ఒక లెక్కగా వేసుకుంటూ.. లెక్కలేనన్ని హామీలు ఇస్తేనే రాజకీయాల్లో పబ్బం గడుస్తుంది! అంతవరకూ ఓకే కానీ… ఆ లెక్కల్లో తేడాలు చూసుకోకుండా.. కాలిక్యులేటర్ ఉంది కదా అని “ప్లస్” సింబల్ మాత్రమే నొక్కుకుంటూ వెళ్లిపోతే మిగిలేది ఏమిటో విర్రాజుకు అనుభవం అయ్యే ప్రమాధం ఉందనేది ఆయన అభిమానుల ఆవేదనగా ఉంది!

“కొత్త” ఉత్సాహమో లేక అత్యుత్సాహమో తెలియదు కానీ… గడిచిన ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ 2024లో అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు వీర్రాజు. అలా అనుకోకపోతే రాజకీయాలో బ్రతకడం కష్టం కాబట్టి ఆ విషయాన్ని లైట్ తీసుకుంటున్నా… లెక్కల విషయంలో మాత్రం మరీ గొప్పలకు వెళ్లిపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ గొప్పల్లో ఏకంగా ప్రజారాజ్యాన్ని – జనసేనను సైతం వేరు వేరుగా చూస్తూ… అంకెలు కలిపేసుకుని ఆనందపడిపోతున్నారు వీర్రాజు! పొత్తు పార్టీ అధినేత పవన్ కంటే ముందుగా చిరంజీవిని కలిసిన వీర్రాజు… అనంతరం పవన్ కి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో స్పందించిన వీర్రాజు… చిరంజీవికి వచ్చిన 18 శాతం ఓట్లు, జనసేనకు వచ్చిన 7శాతం ఓట్లు.. భవిష్యత్తులో తమకు అనుకూలంగా మారతాయని జోస్యం చెప్పారు.

మొన్న చిరంజీవికి వచ్చిన ఓట్లకు పునాది ఏమిటో… నిన్న జనసేనకు వచ్చిన ఓట్లకు పునాది ఏమిటో… నేడు వీర్ర్రాజు రేపటి కోసం కంటున్న కలలకు పునాదిగా ప్లాన్ చేసుకుంటున్న ఓట్లకు పునాది ఏమిటో నిజంగానే తెలియదా? ఒక సామాజికవర్గ అభిమానం పూర్తిగా ఆక్రమించతలపెట్టిన వీర్రాజుకు… ప్రజారాజ్యం – జనసేనకు వచ్చిన ఓట్లు వేరు వేరు అని భావించడం, వాటిని ఒకటిగా చూడకుండా… రెండుగా భావించి లెక్కలేసుకోవడాన్ని ఎలా చూడాలి? దీంతో.. వీర్రాజుది అమాయకత్వమా లేక జనాలే అమాయకులనుకునే అజ్ఞానమా అనేది ఆయనకే తెలియాలనేది విశ్లేషకుల మాటగా ఉంది!!

Read more RELATED
Recommended to you

Latest news