గవర్నమెంట్ ఆఫీసర్స్ గా హీరోలు… నాని, రవితేజ ఫ్లాప్.. మరి నితిన్, రామ్ చరణ్?

-

సినీ ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి అగ్ర తారలు సైతం కొత్త రకమైన ప్రయత్నాలపై మొగ్గు చూపుతున్న రోజులివి. తమ మార్క్‌ అంశాలతోపాటు… కథల్లో, తమ పాత్రల్లో ఇంకేదో నవ నేపథ్యం ఉండాలని తపిస్తున్నారు. అవసరమైతే జానర్‌లు మార్చాలని, భిన్నమైన పాత్రలు భుజానికెత్తుకోవాలని, సాహసాలకి సిద్ధం కావాలని యత్నిస్తున్నారు. కథ నచ్చాలే గానీ ఏ పాత్ర పోషించడానికైనా సై అంటూ రెడీ అయిపోతున్నారు. అలా ఇప్పటివరకు చేయని పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ… అందుకు తగ్గట్టుగా తమను తాము మలుచుకుంటున్నారు.

అయితే ఓ సారి మన కథానాయకుల ప్రయాణాన్ని గమనిస్తే వారు వెండితెర ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతున్నట్లు అర్థమవుతోంది. సాధారణంగా ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగం అంటే మన కథనాయకులు కేవలం పోలీస్​ డ్రెస్​లో మాత్రమే కనిపించారు. కానీ ఇప్పుడు టీచర్​ నుంచి మొదలు కలెక్టర్​ వరకు అన్ని రకాల గవర్నమెంట్​ ఆఫీసర్​ రోల్స్​ పోషించేస్తున్నారు. ఈ ట్రెండ్​ గత కొద్ది కాలంగా కాస్త ఎక్కువైందనే చెప్పాలి. నేచురల్​ స్టార్​ నాని నుంచి మెగాపవర్​ స్టార్​ రామ్​చరణ్ వరకు​.. ఇలా పలువురు హీరోలు ఈ పంథానే ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ సారి ఏఏ హీరోలు ఎలా కనిపించారు? ఆ చిత్రాలేంటి? అవి హిట్టా- ఫట్టా? అసలు ఇంకా ఏఏ కథానాయకులు అలాంటి రోల్స్​తో రాబోతున్నారు? ఆ సంగతులను తెలుసుకుందాం…

రామారావు ఆన్​ డ్యూటీ.. రవితేజ ఎమ్​ఆర్​ఓ నటించిన తాజా చిత్రం ‘రామారావు ఆన్​ డ్యూటీ’. రీసెంట్​గా విడుదలైన ఈ మూవీ డిజాస్టర్​గా నిలిచింది. రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. వేణు తొట్టెంపూడి, నాజర్‌, నరేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

టక్​జగదీశ్​.. నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా తెరకెక్కిన కుటుంబ కథాచిత్రం ‘టక్‌ జగదీశ్‌’. ఇందులో నాని ఎమ్​ఆర్​ఓగా కనిపించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్​ వద్ద చతికిలపడింది. ఈ మూవీలో రీతూవర్మ కథానాయిక. ఐశ్వర్యా రాజేశ్‌ రెండో కథానాయిక. తమన్‌ స్వరాలు అందించారు. కాగా, ప్రస్తుతం నాని ‘దసరా’ చిత్రంలో నటిస్తున్నారు.

రిపబ్లిక్​..యువ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ కలెక్టర్‌గా నటించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. ఫ్యాన్స్​కు ఈ మూవీ ఓ మోస్తరుగా అనిపించినప్పటికీ.. మిగతా వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దేవ కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు, రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు.

పుష్పకవిమానం.. యువ హీరో ఆనంద్ దేవరకొండ ‘ఫుష్పక విమానం’లో గవర్నమెంట్ టీచర్​గా కనిపించారు. ఇది కూడా ఫ్లాప్​ అయింది. మరో మెగాహీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘కొండపొలం’ చిత్రం క్లైమాక్స్‌లో ఐఎఫ్ఎస్ ఆఫీసర్‌గా కనిపించారు. ఇది కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది.

రాబోయే చిత్రాలు..

కథానాయకుడిగా రాజశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’. కృతిశెట్టి కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నటి అంజలి స్పెషల్​ సాంగ్​లో అట్రాక్షన్​గా నిలువనుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్​, ట్రైలర్​ సినిమాపై అంచనాలను రేపాయి.

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ఆర్​సీ 15 సినిమా తెరకెక్కుతోంది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో చరణ్‌ రెండు విభిన్న గెటప్పులో కనిపిస్తారట. ఉన్నతాధికారి ఐఏఎస్​గా కనిపిస్తూనే సాధారణ వ్యక్తిగా మరో గెటప్‌లో అలరించనున్నారట. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పైన ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

మరి ఇప్పటివరకు చిత్రాలన్నీ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. మరి రాబోయే చిత్రాలైనా బాక్సాఫీస్​ ముందు అదరగొడతాయో లేదో చూడాలి…

Read more RELATED
Recommended to you

Latest news